Business- అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ ప్రీమియంతో ‘జియో ఓటీటీ పాస్’ లాంచ్!
రూ.1500 విలువైన ప్రయోజనాలు కేవలం రూ.200 కే.. జియో కొత్త ప్లాన్ వివరాలు ఇవే!
ప్రకటనలు లేని యూట్యూబ్, లైవ్ స్పోర్ట్స్.. జియో సరికొత్త ప్యాక్తో కస్టమర్ల పండగ!
Jio Recharge Plan: ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Jio) డిజిటల్ వినోదాన్ని కోరుకునే తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త బంపర్ ఆఫర్ను ప్రకటించింది. కేవలం రూ.200 ధరలోనే ఏకంగా 15 రకాల ప్రీమియం ఓటీటీ యాప్ల సబ్స్క్రిప్షన్తో కూడిన ‘జియో ఓటీటీ పాస్’ (Jio OTT Pass) ను బుధవారం మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. విడివిడిగా వివిధ ప్లాట్ఫారమ్లకు భారీగా డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేసుకోలేక ఇబ్బంది పడే మధ్యతరగతి వినోద ప్రియులకు ఒకే ప్యాకేజీలో పూర్తి వినోదాన్ని అందించడమే లక్ష్యంగా జియో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సరికొత్త ప్లాన్ యొక్క కాలపరిమితి 28 రోజులుగా కంపెనీ నిర్ణయించింది. కేవలం రూ.200 కే లభించే ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు మార్కెట్లో దాదాపు రూ.1500 విలువైన ఓటీటీ ప్రయోజనాలు ఉచితంగా దక్కనున్నాయి. ఈ ప్యాక్ ద్వారా వినియోగదారులు టీవీ, టాబ్లెట్ లేదా మొబైల్ పరికరాల్లో ఎలాంటి ప్రకటనలు (యాడ్స్) లేకుండా, బ్యాక్గ్రౌండ్ ప్లే మరియు ఆఫ్లైన్ డౌన్లోడ్ ఫీచర్లతో కూడిన ‘యూట్యూబ్ ప్రీమియం’ను పూర్తిగా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. దీనితో పాటు లైవ్ స్పోర్ట్స్, హాట్స్టార్ ఒరిజినల్స్, మరియు బ్లాక్బస్టర్ హాలీవుడ్ కంటెంట్తో కూడిన ‘జియోహాట్స్టార్ మొబైల్ + హాలీవుడ్’ యాక్సెస్ కూడా లభిస్తుంది.
అంతేకాకుండా, ఈ సరికొత్త ప్యాక్లో భాగంగానే ‘అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్’ సబ్స్క్రిప్షన్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. వీటితో పాటు జియో టీవీ యాప్ ద్వారా సోనీలివ్, జీ5, లయన్స్గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్నెక్స్ట్, ఫ్యాన్కోడ్, హోయ్చోయ్, చౌపల్, ప్లానెట్ మరాఠీ, తరంగ్ ప్లస్, టైమ్స్ ప్లే వంటి మరో 12 రకాల ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లను ఉచితంగా వీక్షించే వీలుంది. సినిమాలు, వెబ్ సిరీస్లు మరియు ప్రాంతీయ భాషా చిత్రాలను అమితంగా ఇష్టపడే వారికి ఈ ప్యాక్ ఒక వరంలా మారనుంది.
ఓటీటీ యాప్లతో పాటు వినియోగదారులు జియో టీవీ ద్వారా 1000 కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను కూడా వీక్షించవచ్చు. ఇందులో ప్రముఖ బ్రాడ్కాస్టర్లకు చెందిన 150 కి పైగా పెయిడ్ (చెల్లింపు) ఛానల్స్ కూడా ఉచితంగా వస్తాయి. ముఖ్యంగా జియోస్టార్, సన్టీవీ నెట్వర్క్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ, మరియు ఈటీవీకి చెందిన ప్రాంతీయ వినోద, వార్తా మరియు సినిమా ఛానళ్లు ఇందులో లభిస్తాయి. వినోదంతో పాటు కనెక్టివిటీ పరంగా ఈ ప్లాన్ కింద వినియోగదారులకు 30 జీబీ హైస్పీడ్ 4జీ/5జీ డేటాను కూడా జియో అందిస్తోంది.
అయితే వినియోగదారులు ఈ ప్లాన్ విషయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇది కేవలం డేటా మరియు ఓటీటీ యాడ్-ఆన్ (Add-on) ప్యాక్ మాత్రమే. అంటే ఈ ప్లాన్ ప్రయోజనాలు పొందాలంటే వినియోగదారుడి ఫోన్ నంబర్పై ముందే ఏదైనా యాక్టివ్ బేస్ ప్లాన్ (కాలింగ్ మరియు వాలిడిటీ ప్లాన్) ఉండటం తప్పనిసరి. బేస్ ప్లాన్ ఉన్నవారికి 30 జీబీ డేటాతో పాటు అపరిమిత (అన్లిమిటెడ్) 5జీ డేటా సౌకర్యం కూడా లభిస్తుంది. మే 27 నుండి మైజియో యాప్, జియో అధికారిక వెబ్సైట్ మరియు థర్డ్పార్టీ రీఛార్జ్ ప్లాట్ఫారమ్ల ద్వారా దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలోనూ ఈ రీఛార్జ్ అందుబాటులోకి వచ్చింది.