Amaravati Capital: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేసిన పాపం వైసీపీ నేతలదేనని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. రాజధాని అమరావతి విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఈ మేరకు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
అమరావతిపై నాడు ఎందుకు మౌనం?
రాష్ట్రం విడిపోయిన సమయంలో ఇప్పుడు వైసీపీలో ఉన్న కీలక నేతలందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. అప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకపోయినా, అన్యాయం జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూశారే తప్ప, రాష్ట్ర భవిష్యత్తు గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు.
చంద్రబాబు దూరదృష్టి - ప్రజల తీర్పు
రాజధాని లేని రాష్ట్రానికి అండగా నిలబడతారనే నమ్మకంతోనే ప్రజలు గతంలో చంద్రబాబును ఎన్నుకున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రబాబు అందరి ఆమోదంతో, అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే అమరావతిని రాజధానిగా నిర్ణయించారని చెప్పారు. అప్పట్లో అసెంబ్లీలో ఇదే జగన్ మోహన్ రెడ్డి అమరావతికి ఒప్పుకున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఐదేళ్ల విధ్వంసకర పాలన
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతి ఊసే ఎత్తలేదని, రాజధాని నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో మళ్ళీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఉంటే రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక కొత్త ప్రాజెక్టులు చేపట్టకపోగా, ఉన్న పనులను కూడా నిలిపివేసి రాష్ట్ర అభివృద్ధిని పదేళ్లు వెనక్కి నెట్టారని విమర్శించారు.
మూడు రాజధానుల ముసుగులో డ్రామాలు
మూడు రాజధానుల పేరుతో జగన్ పెద్ద నాటకమాడారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. కేవలం కులాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. "ఉత్తరాంధ్రకు రాజధాని అన్నారు.. మరి ఈ ఐదేళ్లలో అక్కడ ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా?" అని ప్రశ్నించారు. అమరావతిపై డబ్బు అంతా ఖర్చు చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు.
విశ్వసనీయత లేని రాజకీయం
జగన్ మోహన్ రెడ్డికి 'విశ్వసనీయత' అనే పదం వాడే హక్కు లేదని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏకంగా తొమ్మిది సార్లు మాట మార్చిన వ్యక్తికి విలువలు ఎక్కడుంటాయని ప్రశ్నించారు. అమరావతిపై ఎందుకంత కక్షో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మాయమాటలు ఆపి, వాస్తవాలను ఒప్పుకోవాలని అచ్చెన్నాయుడు హితవు పలికారు.