రాయగడ డివిజన్ పరిధి స్పష్టీకరణ చేస్తూ గెజిట్ విడుదల చేసిన కేంద్రం..
పలాస-ఇచ్ఛాపురం సెక్షన్ ను విశాఖ డివిజన్ కు బదిలీ..
విశాఖపట్నం: దక్షిణ భారత రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పరిధిలోని కొన్ని ప్రాంతాలను కలిపి దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway) ఏర్పాటుకు సంబంధించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో రాయగడ డివిజన్ పరిధిని స్పష్టంగా నిర్వచించడంతో పాటు విశాఖ డివిజన్ను విస్తరించేలా కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఈ మార్పుల్లో భాగంగా పలాస-ఇచ్ఛాపురం సెక్షన్ను విశాఖ డివిజన్కు బదిలీ చేశారు. అలాగే ఇచ్ఛాపురం-దువ్వాడ, విజయనగరం సెక్షన్లు కూడా విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చాయి. నుప్పాడ-పర్లాకిమిడి, బొబ్బిలి-సాలూరు సెక్షన్లను కూడా విశాఖ డివిజన్లోకి చేర్చారు. సింహాచలం-వడ్లపూడి, విశాఖ-జగ్గయ్యపాలెం సెక్షన్లు కూడా విలీనం చేయడం ద్వారా విశాఖ డివిజన్ మరింత విస్తరించింది.
రాయగడ డివిజన్ నుంచి కొన్ని కీలక మార్గాలను విడదీసి, మొత్తం 463 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని విశాఖ డివిజన్కు కలుపుతూ దక్షిణ కోస్తా రైల్వేలో విలీనం చేశారు. ఇక కోరాపుట్-కిరండోల్ రైల్వే లైన్ను విశాఖ మరియు రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించడం జరిగింది.
ఇదే సమయంలో, విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు కూడా చర్యలు వేగం పుంజుకున్నాయి. ఆరిలోవలో శాశ్వత కార్యాలయ నిర్మాణం చేపట్టనుండగా, వీఎంఆర్డీఏ డెక్లోని రెండు అంతస్తుల్లో తాత్కాలికంగా జీఎం కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. జూన్ 1 నుంచి ఈ కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కొత్త ఊపొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం రైల్వే హబ్గా మరింత బలపడుతుందని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.