భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళను సశస్త్ర సీమా బల్ (SSB) సిబ్బంది పట్టుకున్నారు. సరైన వీసా, పాస్పోర్టు వంటి తప్పనిసరి ప్రయాణ పత్రాలు లేకుండానే ఇండో–నేపాల్ సరిహద్దును దాటేందుకు ఆమె యత్నించడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సరిహద్దు భద్రత పరంగా ఇది కీలక సంఘటనగా అధికారులు భావిస్తున్నారు.
శుక్రవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో భారత్–నేపాల్ సరిహద్దుకు సమీపంలోని నౌటన్వా ప్రాంతంలో ఉన్న బైరియా బజార్ వద్ద కాలిబాట మార్గంలో ఒక మహిళ భారత్లోకి ప్రవేశిస్తున్నట్లు ఎస్ఎస్బీ సిబ్బంది గమనించారు. అనుమానం రావడంతో ఆమెను వెంటనే ఆపి తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో ఆమె వద్ద పాస్పోర్టు, వీసా వంటి ఎలాంటి చెల్లుబాటు అయ్యే పత్రాలు లేవని తేలింది. దీంతో నిబంధనల ప్రకారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఎస్ఎస్బీ సిబ్బంది అదుపులోకి తీసుకున్న మహిళను నౌటన్వా పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెను విచారించగా, ఆమె వద్ద లభించిన ఒక చిన్న చీటి ఆధారంగా సదరు మహిళ చైనాకు చెందిన హుజియా జీగా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఆమె చైనాలోని ఏ ప్రాంతానికి చెందినది, భారత్లోకి రావడానికి ఆమె అసలు ఉద్దేశం ఏమిటి అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ అంశాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ఇండో–నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కఠినతరం చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా విదేశీయులు భారత్లోకి ప్రవేశించే ప్రయత్నాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఎస్బీ స్పష్టం చేసింది. ముఖ్యంగా కాలిబాట మార్గాలు, గ్రామీణ సరిహద్దు ప్రాంతాల్లో పహారా పెంచినట్లు సమాచారం. ఈ ఘటన దేశ భద్రత పరంగా కూడా ప్రాధాన్యత కలిగినదిగా భావిస్తుండటంతో, సంబంధిత కేంద్ర నిఘా సంస్థలకు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ఆమె భారత్లోకి రావడానికి గల ఉద్దేశం ఏమిటి? ఆమె అసలు ఉద్దేశం ఇంకా స్పష్టతకు రాలేదు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.