వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు..
విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ చేసిన శాప్ ఛైర్మన్ రవినాయుడు..
విజయవాడ: రాష్ట్రంలో యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు శాప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు–2026 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ శిబిరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 423 మండలాల్లో 1,020 వేదికల వద్ద 1,389 శిబిరాలు ప్రారంభమయ్యాయి. క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి మొత్తం 55 క్రీడాంశాల్లో నెల రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ, “విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా పెంచుతాయి” అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నదే ఈ శిబిరాల లక్ష్యమని చెప్పారు.
శిబిరాల్లో పాల్గొనే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పౌష్టికాహారం కూడా అందిస్తామని ఆయన వెల్లడించారు. మంచి కోచ్లు, సరైన పరికరాలతో శిక్షణ ఇచ్చి, భవిష్యత్తులో రాష్ట్రానికి గౌరవం తెచ్చే క్రీడాకారులను తయారు చేయాలని శాప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, క్రీడల వైపు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.