జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నియమావళి ప్రకారం ఆ నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడి, ఓటర్లపై ఏవైనా ప్రభావాలు ఉండకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసి, అన్ని లైసెన్స్ కలిగిన మద్యం విక్రేతలు, బార్లు, వైన్ షాపులు ఆంక్షలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.
నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లలోని బార్లు, స్టార్ హోటళ్లలోని లైసెన్స్ పొందిన బార్లు, క్లబ్లతో సహా అన్ని ప్రదేశాల్లో మద్యం విక్రయం, సర్వ్ చేయడం నిషేధించారు. ఈ ఆంక్షలు నవంబర్ 12 వరకు కొనసాగుతాయి. పోలింగ్ పూర్తైన మరుసటి రోజు నుంచి మాత్రమే మద్యం విక్రయాలను తిరిగి అనుమతిస్తారు. అంతేకాదు, ఓట్ల లెక్కింపు రోజైన నవంబర్ 14న కూడా అదే నిషేధం అమల్లో ఉండనుంది. మొత్తం మూడు దశల్లో — పోలింగ్కు ముందు, పోలింగ్ రోజు, లెక్కింపు రోజు — జూబ్లీహిల్స్ అంతటా మద్యం దుకాణాలు మూత పడనున్నాయి.
ఎన్నికల సందర్భంలో చట్టవ్యవస్థకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. అధికారులు ప్రాంతంలో పర్యవేక్షణను కట్టుదిట్టం చేస్తూ, నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, వ్యాపారులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను గౌరవించాలని కోరారు.
ఇక రాజకీయ రంగంలోనూ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హాట్టాపిక్గా మారింది. గత జూన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఖాళీ అయిన ఈ సీటు కోసం ఈ ఎన్నిక జరగుతోంది. ఈసారి త్రికోణ పోటీ నెలకొంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత బరిలో ఉండగా, కాంగ్రెస్ నవీన్ యాదవ్, బీజేపీ లంకా దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దీపక్ రెడ్డి ఇదే నియోజకవర్గంలో పోటీచేసి ఓటమి పాలయ్యారు. AIMIM పార్టీ ఈసారి కాంగ్రెస్కు మద్దతు ప్రకటించడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్ రాజకీయ పటంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది.