Healthy Breakfast Telugu: రోజువారీ ఉరుకుల పరుగుల జీవితంలో వంట గదిలో ఎక్కువ సమయం గడపడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేవారు, పిల్లలకు లంచ్ బాక్స్ సర్దే తల్లులు 'తక్కువ టైంలో.. టేస్టీగా' ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి 'కొత్తిమీర రైస్' ఒక అద్భుతమైన ఆప్షన్. మసాలా ఫ్లేవర్తో, నోరూరించే రుచితో ఉండే ఈ హెల్దీ రైస్ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ముందుగా కావాల్సినవి
ఈ రెసిపీ కోసం ఒక పావు కిలో ఉడికించిన అన్నం పొడిపొడిగా ఉండాలి ఒక కప్పు తాజా కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి గరం మసాలా దినుసులు సిద్ధం చేసుకోవాలి.
మసాలా పేస్ట్ తయారీ:
కొత్తిమీర రైస్కు అసలైన రుచిని ఇచ్చేది మనం తయారు చేసే పేస్ట్. మిక్సీ జార్లో కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయాలి. దీనికి తోడు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా చేర్చాలి. ఇక్కడ ఒక చిన్న చిట్కా.. కొత్తిమీర రంగు మారకుండా ఉండాలంటే అర టీస్పూన్ చక్కెర వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీనివల్ల రుచి పెరగడమే కాకుండా రైస్ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేయాలి. నూనె కాగాక బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి సగం వేగాక పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఇవి త్వరగా ఉడకడానికి కొంచెం ఉప్పు చేర్చి మూత పెట్టాలి. ముక్కలు మెత్తబడ్డాక మనం రెడీ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ను వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
మసాలా వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసి బాగా కలపాలి. దీనిపై రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి చల్లాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర తురుము వేసి, ఒక్క నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచితే మసాలాలన్నీ అన్నానికి పట్టి గుమగుమలాడే కొత్తిమీర రైస్ రెడీ అవుతుంది.
ఈ కొత్తిమీర రైస్ను వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. పెరుగు రైతాతో కలిపి తీసుకుంటే దీని రుచి రెట్టింపు అవుతుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలో ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి..