Business- 6 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇరాన్ షిప్పులు..
డాలర్ల ఆట ముగిసిందా? ఇరాన్ చమురుకు రూపాయిల్లో చెల్లింపులు..
హర్మూజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు…
Iranian Oil: అంతర్జాతీయ ఆంక్షల కారణంగా గత ఆరేళ్లుగా నిలిచిపోయిన ఇరాన్ ముడిచమురు దిగుమతులు మళ్లీ ప్రారంభం కానుండటం భారత ఇంధన రంగంలో ఒక కీలక పరిణామం. 2019 మే నుండి భారత్ ఇరాన్ చమురును కొనుగోలు చేయడం నిలిపివేయగా, ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా అమెరికా తన ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లు దాటడంతో, ధరలను అదుపులోకి తెచ్చే వ్యూహంతో అమెరికా ఈ 30 రోజుల వెసులుబాటును కల్పించింది. ఏప్రిల్ 19వ తేదీ వరకు లభించిన ఈ గడువును ఉపయోగించుకుని భారతీయ రిఫైనరీలు భారీగా చమురు నిల్వలను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే ఇరాన్ నుండి 5 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. గ్లోబల్ మార్కెట్లో లభించే 'బ్రెంట్' ముడిచమురు ధర కంటే ఇరాన్ ట్రేడర్లు 6 నుండి 8 డాలర్లు అధిక ప్రీమియం కోరుతున్నప్పటికీ, ఇంధన భద్రత దృష్ట్యా మన కంపెనీలు కొనుగోళ్లకే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ సరఫరాకు కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో, తక్షణ అవసరాల కోసం ఈ దిగుమతులు ఎంతో కీలకంగా మారాయి. రష్యా చమురుతో పాటు ఇరాన్ నుండి కూడా దిగుమతులు పెరగడం వల్ల దేశీయ ఇంధన నిల్వలకు గట్టి భరోసా లభిస్తుంది.
ఈ ఒప్పందంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చమురు కొనుగోళ్లకు సంబంధించి రూపాయల్లో చెల్లింపులు (Rupee Payments) చేసేందుకు కూడా ఇరాన్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. దీనివల్ల డాలర్ నిల్వలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, రూపాయి అంతర్జాతీయీకరణకు కూడా మేలు జరుగుతుంది. గతంలో కూడా భారత్-ఇరాన్ మధ్య ఇలాంటి చెల్లింపుల వ్యవస్థ ఉండేది, అది ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించబడటం ఆర్థికంగా మనకు కలిసొచ్చే అంశం. ఏప్రిల్ రెండో వారంలోపు ఈ చమురు లోడుతో ఉన్న నౌకలు భారత తీరానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇరాన్ చమురు రాకతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. అంతర్జాతీయ మార్కెట్లో సరఫరా పెరగడం వల్ల ముడిచమురు ధరలు కొంతమేర దిగివచ్చే అవకాశం ఉంది, ఇది పరోక్షంగా భారత వినియోగదారులకు ఊరటనిస్తుంది. తన అవసరాల్లో 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్న భారత్కు, ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు దొరకడం వల్ల ఇంధన సంక్షోభం నుండి గట్టెక్కవచ్చు. అమెరికా ఇచ్చిన ఈ 30 రోజుల గడువును గరిష్టంగా వినియోగించుకుని, వీలైనంత ఎక్కువ ముడిచమురును దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం భారతీయ చమురు సంస్థలను ప్రోత్సహిస్తోంది.