US-Iran War 2026: పశ్చిమ ఆసియాలో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా ఘన విజయం సాధించిందని ప్రకటించారు. ప్రస్తుతం ఇరాన్ సైనిక శక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, ఆ దేశం కోలుకోలేని దెబ్బ తిన్నదని ఆయన పేర్కొన్నారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొన్న ట్రంప్, యుద్ధం ముగింపు దశకు వచ్చిందని, శాంతి చర్చలు మొదలయ్యాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇరాన్ ఇప్పుడు చాలా బలహీనంగా ఉందని, అందుకే చర్చలకు సిద్ధమైందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. యుద్ధం వల్ల ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం వారి కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయని వివరించారు. అమెరికా తలుచుకుంటే ఆ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలను ఎప్పుడైనా కూల్చేయగలదని, ప్రస్తుతానికి ఇరాన్ గగనతలంపై పూర్తి పట్టు అమెరికా సేనలకే ఉందని స్పష్టం చేశారు. వారు ఇప్పుడు చర్చలు కోరుకుంటున్నారు, ఎందుకంటే వారి దగ్గర ఏమీ మిగలలేదు అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ యుద్ధానికి బీజం ఫిబ్రవరి 28న పడిందన్న విషయం అందరికీ తెలిసినదే అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు అగ్రశ్రేణి నాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా పెద్ద ఎత్తున డ్రోన్లతో, మిస్సైళ్లతో ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేసి గందరగోళం సృష్టించింది. ఈ పోరులో ఇరాన్ నాయకత్వం పూర్తిగా దెబ్బతినడంతో అక్కడ పాలనలో మార్పులు వస్తాయని ట్రంప్ అంచనా వేస్తున్నారు.
అణు ఆయుధాల విషయంలో అమెరికా తన పట్టు సడలించడం లేదు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణుబాంబును తయారు చేయకూడదనే ప్రధాన షరతుపై చర్చలు జరుగుతున్నాయని, దీనికి ఇరాన్ కూడా అంగీకరించిన ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు. అనవసరంగా మరిన్ని ప్రాణాలు పోవడం, అక్కడి భారీ విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నట్లు తెలిపారు. అమెరికా ప్రస్తుతం చాలా బలమైన స్థితిలో ఉందని, తాము అనుకున్న షెడ్యూల్ కంటే ముందే లక్ష్యాలను చేరుకున్నామని వివరించారు.
హార్ముజ్ జలసంధి గుండా చమురు, గ్యాస్ రవాణాను పునరుద్ధరించేందుకు ఇరాన్ సానుకూలంగా స్పందించడం ఒక మంచి పరిణామమని ట్రంప్ పేర్కొన్నారు. అయినప్పటికీ, ఇరాన్ నాయకత్వాన్ని తాము పూర్తిగా నమ్మడం లేదని, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టనున్నాయి. మరోవైపు, ట్రంప్ ప్రకటనలపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన వస్తుందోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.