జలధర-జలహారతి కార్యక్రమం పై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..
క్షేత్రస్థాయిలో జల ధార-జల హారతి పనులను సీఎంకు వివరించిన అధికారులు..
అమరావతి: రాష్ట్రంలో నీటి సంరక్షణకు కీలకంగా భావిస్తున్న జలధార–జలహారతి కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం స్పష్టంగా ఆదేశించారు.
జలధార కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయడానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ను నోడల్ అధికారిగా నియమించినట్లు సీఎం తెలిపారు. భూగర్భ జలాలు పెరగడం వల్ల రైతులకు పెద్ద ఊరటనిస్తుందని, ముఖ్యంగా విద్యుత్ వినియోగం తగ్గి ప్రభుత్వంపై ఉన్న ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఆయన చెప్పారు. విద్యుత్ ఖర్చు తగ్గితే ఆ నిధులను ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించవచ్చని వివరించారు.
జలధార కింద రాష్ట్రంలోని అన్ని ఆలయాల పుష్కరణీలను నింపేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని, అర్బన్ మండలాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.
నీటి సంరక్షణలో అన్నమయ్య జిల్లా చూపించిన మోడల్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సీఎం సూచించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం కావడం కష్టమని, అందుకే ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించడం లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని నీటి సంపదతో సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.