విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు నిర్మించిన హైదరాబాద్ లో నిర్మించిన సైబర్ టవర్ ఐటీకి ఐకానిక్..
ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కు సెల్యూట్..
విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన ప్రసంగం విశాఖ భవిష్యత్తుపై ఆశలను మరింత పెంచింది. ఈ సందర్భంగా ఆయన దేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల పురోగతిని వివరించడంతో పాటు, విశాఖను ఏఐ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా జరుగుతున్న చర్యలను ప్రస్తావించారు.
మంత్రి మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో నిర్మించిన సైబర్ టవర్స్ ఐటీ రంగానికి ఐకానిక్గా నిలిచాయని గుర్తు చేశారు. ఇప్పుడు అదే విజన్తో విశాఖపట్నం కూడా గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా “ఏఐ పట్నం”గా మారబోతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు విజన్కు తాను సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు.
విద్య, వైద్యం, ఏరోస్పేస్, లాజిస్టిక్స్, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఏఐ విప్లవం రాబోతోందని ఆయన తెలిపారు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ ద్వారా విశేష సేవలు అందుతాయని, ఎంఓయూ కుదిరిన తక్కువ సమయంలోనే ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరగడం వేగవంతమైన అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. త్వరలోనే ఈ డేటా సెంటర్ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించే రోజు దగ్గరలోనే ఉందని వెల్లడించారు.
భారత్ ఐటీ సేవల రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహిస్తోందని చెప్పిన మంత్రి, గతంలో ఉత్పత్తి రంగంలో వెనుకబడ్డామని అంగీకరించారు. అయితే ఇప్పుడు సెమీ కండక్టర్లు, చిప్స్, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్ల తయారీలో దేశం ముందడుగు వేసిందని చెప్పారు. ప్రధాని మోదీ చొరవతో మొబైల్ మాన్యుఫాక్చరింగ్ రంగం బలపడిందని, భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతులు గణనీయంగా పెరిగాయని వివరించారు. దేశంలో అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాలలో 50 శాతం వరకు స్వదేశంలోనే తయారు చేస్తున్నామని తెలిపారు.
ఇకపై డేటా సెంటర్లకు అవసరమైన సర్వర్లు, జీపీయూలు, చిప్స్ కూడా భారత్లోనే తయారు చేయాలని టెక్ కంపెనీలకు సూచించారు. గూగుల్ కూడా ఈ దిశగా ముందుకు రావాలని, ఈ విషయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తక్కువ వ్యయంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసే సామర్థ్యం భారత్కు ఉందని స్పష్టం చేశారు.
విశాఖ నుంచి మూడు సబ్సీ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నందుకు గూగుల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కేబుల్స్ ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ మీదుగా యూరప్కు, అలాగే ఆఫ్రికా ద్వారా అమెరికాకు కనెక్టివిటీ కల్పించనున్నాయని చెప్పారు. దీంతో విశాఖ అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ హబ్గా మారుతుందని పేర్కొన్నారు.
రైల్వే రంగంలో కూడా కేంద్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోందని ఆయన వెల్లడించారు. ఏపీకి రూ.10,134 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని, గతంలో ఇది కేవలం రూ.886 కోట్లు మాత్రమే ఉండేదని చెప్పారు. ప్రస్తుతం రూ.1.06 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని వివరించారు. 74 స్టేషన్లను ఆధునీకరిస్తూ, 832 ఫ్లైఓవర్లు, అండర్పాసులు నిర్మిస్తున్నామని తెలిపారు. 100 శాతం రైల్వే ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కాగా, వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు రాష్ట్రంలో నడుస్తున్నాయని చెప్పారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను 2026 జూన్ 1న అధికారికంగా నోటిఫై చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే అమరావతి నుంచి హైదరాబాద్కు 70 నిమిషాల్లో, చెన్నైకు 112 నిమిషాల్లో చేరుకునేలా బులెట్ ట్రైన్ ప్రాజెక్టులను త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
చివరిగా, అభివృద్ధి, సంక్షేమంలో దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని, అయితే ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయంగా మార్చుతున్నాయని విమర్శించారు. కోల్కతా నుంచి చెన్నై వరకూ తూర్పు కోస్తా రైల్వే లైన్లను నాలుగు లైన్లుగా విస్తరించి, భారీ స్థాయిలో రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు.