పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత..
గ్రామాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ..
ప్రకాశం జిల్లా కొండపిలో గ్రామాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.
శుక్రవారం కొండపి గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నిధులతో అందించిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” రిక్షాలు, చెత్త సేకరణ డబ్బాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో నూరు శాతం చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి గుర్తుచేశారు. మన చుట్టూ శుభ్రత ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలమని అన్నారు. ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, చెత్తపై పన్ను వేసి ప్రజలను ఇబ్బంది పెట్టారని, అయితే ప్రస్తుత ప్రభుత్వం చెత్త నుంచే సంపద సృష్టించే దిశగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కేవలం 20 నెలల కాలంలోనే గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
గ్రామాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా, పచ్చగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.