RRR Custodial Torture Case: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ సీఐడీ మాజీ ఎస్పీ సునీల్ నాయక్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వరుసగా మూడో రోజు విచారణకు హాజరైన ఆయనకు విచారణాధికారుల ప్రశ్నలు చుక్కలు చూపించాయి. దాదాపు మూడు రోజుల పాటు సాగిన ఈ సుదీర్ఘ విచారణలో సునీల్ నాయక్ నోరు విప్పకపోగా, అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. విచారణాధికారులు సంధించిన కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన ముఖం వేలాడేయడం చూస్తుంటే, ఆయన అరెస్ట్ ఇక లాంఛనమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
ఎఫ్ఐఆర్ కంటే ముందే వేట మొదలైందా?
విచారణలో భాగంగా అధికారులు ప్రధానంగా ఎఫ్ఐఆర్ నమోదు సమయంపై దృష్టి సారించారు. రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు కాకముందే సీఐడీ బృందం హైదరాబాద్కు ఎందుకు బయలుదేరిందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. రికార్డుల ప్రకారం ఎఫ్ఐఆర్ ఉదయం 9:30 గంటలకు నమోదైతే, పోలీసులు అంతకుముందే అంటే 8:30 గంటలకే హైదరాబాద్ బయలుదేరినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దీనిపై సునీల్ నాయక్ను ప్రశ్నించగా, "వారు ఎందుకు వెళ్లారో నాకు తెలియదు" అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. కానీ, ఒక పక్కా ప్లాన్ ప్రకారమే రఘురామ పుట్టినరోజు నాడే ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఈ ఆపరేషన్ నిర్వహించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ రాత్రి సీఐడీ ఆఫీసులో ఏం జరిగింది?
అరెస్ట్ చేసిన తర్వాత రఘురామను సీఐడీ కార్యాలయంలో ఉంచిన సమయంలో సునీల్ నాయక్ అక్కడే ఉన్నట్లు విచారణలో తేలింది. మొదట బుకాయించినప్పటికీ, చివరకు తాను పక్క గదిలోనే ఉన్నానని ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం. రాజు గారి అరుపులు మీకు వినపడలేదా? అని అధికారులు అడిగిన ప్రశ్నకు "నాకేమీ వినపడలేదు" అని ఆయన సమాధానమిచ్చారు. అయితే, అదే సమయంలో బయట వ్యక్తులు లోపలికి వచ్చినట్లు కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది ఇచ్చిన స్టేట్మెంట్లతో సునీల్ నాయక్ చెప్పిన మాటలు పొంతన కుదరడం లేదు. బాధితుడికి గాయాలైన విషయం తనకు తెలియదని చెప్పడం కూడా అధికారులను విస్మయానికి గురిచేసింది.
జీజీహెచ్ పర్యవేక్షణ వెనుక అసలు ఉద్దేశం ఏంటి?
మరుసటి రోజు రఘురామను గుంటూరు జీజీహెచ్కు వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లినప్పుడు కూడా సునీల్ నాయక్ అక్కడ ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఒక నిందితుడికి వైద్య పరీక్షలు జరుగుతున్నప్పుడు ఫిర్యాదుదారుడు లేదా కేసులో కీలక వ్యక్తి అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. దీనిపై అధికారులు నిలదీయగా, "ఆయన ఒక సెలబ్రిటీ, ఎంపీ కాబట్టి పర్యవేక్షించడానికి వెళ్ళాను" అని వింత సమాధానం చెప్పారు. వాస్తవానికి అక్కడ వైద్యులపై ఒత్తిడి తెచ్చేందుకే ఆయన వెళ్లారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
బీహార్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
ప్రస్తుతం సునీల్ నాయక్ సర్వీసులో ఉన్న అధికారి కావడంతో, ఆయన్ని అరెస్ట్ చేయాలంటే బీహార్ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అయితే, ప్రస్తుతం బీహార్లో మారిన రాజకీయ సమీకరణాలు, ఏపీలోని కూటమి ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా అరెస్ట్ పర్మిషన్ రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు ఆయనకు ఇబ్బందికరంగా మారాయి. విచారణకు సహకరించడం లేదన్న పాయింట్ను పోలీసులు హైకోర్టులో బలంగా వినిపించే అవకాశం ఉంది.
రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురిచేసిన కేసులో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అధికారులు అతిగా వ్యవహరించారనే ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి. సునీల్ కుమార్, విజయ్ పాల్ వంటి ఇతర అధికారులతో పాటు సునీల్ నాయక్ కూడా ఈ ఊబిలో కూరుకుపోయారు. సోమవారం హైకోర్టులో జరగబోయే విచారణ ఈ కేసులో అత్యంత కీలకం కానుంది.