Chief Ministers Meeting: పశ్చిమాసియాలో ముదురుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ మేఘాలు ఇప్పుడు భారతదేశాన్ని కలవరపెడుతున్నాయి. ఈ యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా సామాన్యుడిపై పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. శుక్రవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. దేశం ఎదుర్కోబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కీలక సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మెజారిటీ రాష్ట్రాల అధినేతలు హాజరయ్యారు. అయితే ఎన్నికల హడావుడిలో ఉన్న పశ్చిమ బెంగాల్, కేరళ వంటి ఐదు రాష్ట్రాల సీఎంలు మాత్రం ఈ భేటీకి దూరంగా ఉన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొన్న ఈ సమావేశంలో.. యుద్ధం వల్ల చమురు సరఫరా ఆగిపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏంటి? అన్న దానిపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.
యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, అది నిత్యావసర వస్తువుల ధరల మీద ప్రభావం చూపకుండా చూడాలని ప్రధాని సూచించారు. "మనం ఒక టీమ్ ఇండియాగా పని చేయాలి" అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, ఇంధన నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని మరియు ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) అదుపులో ఉండేలా రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కోరారు.
ముఖ్యంగా రవాణా రంగం దెబ్బతినకుండా చూడటంపై ఈ భేటీలో లోతైన చర్చ జరిగింది. గ్యాస్ ఇతర ముడి సరుకుల సరఫరాలో అంతరాయం కలగకుండా కేంద్రం తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. రాష్ట్రాల్లో ఉన్న నిత్యావసరాల నిల్వలను పర్యవేక్షించాలని, బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేశారు. యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో తెలియని పరిస్థితుల్లో అన్నింటికీ సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
దేశ భద్రత ఆర్థిక స్థిరత్వం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఈ సమావేశం తీర్మానించింది. యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను తట్టుకోవడానికి రాష్ట్రాలకు కేంద్రం పూర్తి మద్దతు ఇస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. అటు చమురు సంక్షోభం నుంచి బయటపడటానికి రష్యా నుండి ఎల్ఎన్జీ కొనుగోలు చేసే విషయంలో అమెరికా నుంచి మినహాయింపులు కోరడం వంటి దౌత్యపరమైన అడుగుల గురించి కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.