రైతులు ఎంత శ్రమించుకున్నారు అన్నది పక్కన పెడితే, నాణ్యమైన విత్తనాలు మరియు పంటకు సరిపోయే మొక్కలు లేకపోతే భారీ నష్టాలు తప్పవు. ముఖ్యంగా మిరప, టమాటా, కొబ్బరి, ఆయిల్ పామ్, కోకో వంటి ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఎక్కువగా నర్సరీల నుంచి మొక్కలు కొనుగోలు చేస్తారు. అయితే నర్సరీలో తీసుకున్న మొక్కలు సరైన పూట, పిందె, పండును ఇవ్వకపోతే పెట్టిన మొత్తం పెట్టుబడి వృథా అవుతుంది. అందుకే వ్యవసాయ నిపుణులు రైతులు నర్సరీల్లో మొక్కలు కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తెలిసిన వాళ్ల మాటకే కాకుండా, ఉద్యాన శాఖ సూచించిన రకాలు ఏవో చూసుకుని, వాటిని సాగుకు అనువైనవో కాదో ముందుగా నిర్ధారించుకోవాలి.
ముఖ్యంగా పండ్ల తోటల్లో తల్లి మొక్క (మదర్ ప్లాంట్) ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే తల్లి మొక్క లక్షణాలే అంటుకట్టిన మొక్కలపై ప్రతిబింబిస్తాయి. చాలా నర్సరీలు లాభం కోసం అందుబాటులో ఉన్న ఏ రకమైనా కట్టుకుని అమ్ముతుంటాయి. దీంతో రైతులకు రాకపోయే దిగుబడి వల్ల భారీ నష్టాలు వస్తాయి. అదే విధంగా నర్సరీ విశ్వసనీయత కూడా చూసుకోవాలి. లైసెన్సు లేకుండా నడిచే నర్సరీల్లో రకాల స్పష్టత, నాణ్యత ప్రమాణాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఆ నర్సరీలో అమ్ముతున్న రకం ఏది, తల్లి మొక్క వివరాలు ఏవి, సాగు ప్రాంతానికి అనుకూలమా కాదా వంటి అంశాల్ని పరిశీలించాలి.
రైతులు నర్సరీల్లో మొక్కలు లేదా నార్లు కొన్నప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. ఎందుకంటే మొక్కల్లో లోపాలు ఉండి పంట సరైన దిగుబడి ఇవ్వకపోతే, రసీదు ఆధారంగా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కలకు తెగుళ్లు లేదా పురుగులు ఉన్నాయో లేదో కూడా సవివరంగా చూడాలి. ఒకే మొక్క నుంచి వ్యాపించే తెగులు మొత్తం తోటను నాశనం చేసే ప్రమాదం ఉంది. మొక్కలకు వచ్చే సమస్యలు, వాటికి ఎలాంటి నివారణలు తీసుకోవాలి అనే విషయాలను నర్సరీ యజమానిని ప్రశ్నించి తెలుసుకోవడం రైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఇలా ముందుగానే సస్యరక్షణ చర్యలు తీసుకుంటే, తోట ఆరోగ్యం కాపాడుకోవచ్చు.
మొక్కలు కొనేటప్పుడు వాటి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. బలహీనంగా ఉన్నవి, ఒక వైపు వంగి ఉన్నవి, చీలిన కాండం ఉన్నవి కొనకూడదు. కాండం బలంగా ఉండి, పైన కొమ్మలు ఉన్న మొక్కలు ఎంచుకోవాలి. నేలలో పెంచిన మొక్కలను తీసుకుంటే వేర్లు తెగిపోయే ప్రమాదం ఉండటంతో పాలీకవర్లో పెంచిన మొక్కలను మాత్రమే తీసుకోవడం మంచిది. అలాగే అంటుకట్టిన ప్రాంతం నేలపై ఉండాలి; చీలిపోయి, ఉబ్బిపోయిన చోటు కనిపిస్తే అలాంటి మొక్కలను తీసుకోవద్దు. మామిడి, సపోట, జీడి, నిమ్మ వంటి పండ్ల సాగు కోసం దాదాపు ఏడాదిన్నర వయస్సు గల మొక్కలనే ఎంచుకోవాలి. కొబ్బరి మొక్కల విషయంలో టెంక పూర్తిగా భూమిలో కనిపించినా, ఆకులు ఎక్కువగా విచ్చుకున్నా కొనగూడదు. ఈ అన్ని సూచనలను పాటిస్తే రైతులు నాణ్యమైన మొక్కలు పొందడమే కాకుండా భవిష్యత్లో భారీ నష్టాలనుంచి తప్పించుకోవచ్చు.