ఇళ్ల స్థలాల పేరిట భారీ దోపిడీ…
కృత్తివెన్నులో బయటపడ్డ వైసీపీ నేతల అక్రమాలు…
తీర ప్రాంత రక్షణ కవచానికే తూట్లు…
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి జోగి రమేశ్ ఆధ్వర్యంలో ఇక్కడ భారీగా నిధులు దారి మళ్లాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా పర్యావరణానికి ఎంతో మేలు చేసే మడ అడవులను నాశనం చేసి, ఆ భూమిని ఇళ్ల స్థలాల కోసం వాడటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
సముద్ర తీర ప్రాంతాన్ని రక్షించే మడ అడవులను సుమారు ఏడు ఎకరాల వరకు జెసిబిలతో తొలగించేశారు. పర్యావరణ చట్టాల ప్రకారం ఇలాంటి చోట్ల ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. కానీ, అధికార బలం ఉపయోగించి అడవిని కొట్టేసి, ఆ స్థలాన్ని ఇళ్ల పట్టాల కోసం సిద్ధం చేశారు. ఇది ప్రకృతికి విఘాతం కలిగించడమే కాకుండా, భవిష్యత్తులో తీర ప్రాంతానికి ముప్పు తెచ్చేలా ఉందని తెలిపారు.
నిజానికి ఆ ప్రాంతం ఇళ్లు కట్టుకోవడానికి అస్సలు పనికిరాదు. అది పూర్తిగా పల్లపు ప్రాంతం కావడంతో, దాన్ని పూడ్చడానికి ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకున్నారు. ఉపాధి హామీ పథకం నుండి రూ. 16.64 లక్షలు, గృహ నిర్మాణ శాఖ నుండి మరో రూ. 16.24 లక్షలు ఇలా మొత్తం నిధులను మట్టి పనుల పేరుతో డ్రా చేశారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అరకొర పనులు మాత్రమే జరిగాయి.
కేవలం నాలుగు ఎకరాల్లోనే కాస్త మట్టి పోసి వదిలేశారు. మిగిలిన డబ్బులన్నీ నేతలు, కొందరు అధికారులు పంచుకున్నారని విమర్శలు వస్తున్నాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు ఆ ప్రాంతమంతా చెరువులా మారిపోతోంది. మోకాలోతు నీళ్లు నిలుస్తున్న చోట పేదలు ఇళ్లు ఎలా కట్టుకుంటారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పేదల కంటే నేతల జేబులు నింపుకోవడానికే ఈ పథకాన్ని వాడుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ అక్రమాలకు సంబంధించిన రికార్డులను కూడా మాయం చేశారని అధికారులను భయపెట్టి ఫైళ్లను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణాన్ని పాడు చేసి, ప్రభుత్వ సొమ్మును కాజేసిన ఈ వ్యవహారంపై కొత్త ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.