Andhra Pradesh Education: రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తున్నట్లు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనమండలి వేదికగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
పాత బకాయిల చెల్లింపు.. నాణ్యతకు ప్రాధాన్యం
గత ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి దాదాపు రూ.18.96 కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టిందని, బాధ్యత గల ప్రజా ప్రభుత్వంగా తాము ఆ బకాయిలన్నింటినీ క్లియర్ చేశామని లోకేష్ స్పష్టం చేశారు. కేవలం పంపిణీ చేయడమే కాకుండా, విద్యార్థినుల నుంచి నేరుగా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఆర్టీజీఎస్ ద్వారా ఫోన్ కాల్స్ చేసి అడగగా.. 96 శాతం మంది బాలికలు తమకు సక్రమంగా అందుతున్నాయని చెప్పారని, నాణ్యత విషయంలో కూడా 85 శాతం మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. విద్యార్థినుల కోరిక మేరకు గతంలో ఇచ్చే సైజుల సంఖ్యను మార్చి, ఇప్పుడు 5 రెగ్యులర్, 5 లార్జ్ సైజ్ ప్యాడ్లను అందజేస్తున్నట్లు వివరించారు.
ఆధునిక పద్ధతులు - ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్లు
బాలికల సౌకర్యం కోసం కేజీబీవీ పాఠశాలల్లో ఇప్పటికే 'స్మార్ట్ కార్డ్' ఆధారిత వెండింగ్ మిషన్లను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టామని, త్వరలోనే వీటిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు విస్తరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. పర్యావరణానికి మేలు చేసే 'ఎకో ఫ్రెండ్లీ' శానిటరీ ప్యాడ్ల పంపిణీపై కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని, దీనిపై ఎన్జీవోలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హెచ్పీవీ వ్యాక్సిన్పై ప్రత్యేక అవగాహన
మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ను నివారించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెచ్పీవీ వ్యాక్సిన్పై రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తామని లోకేష్ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించి, ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.