AP Revenue Meetings Updates: భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి వర్క్షాపులు
రైతులకు భరోసా… పారదర్శక పాలన అందిస్తాం
భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వేగం పెంచింది
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి మంచి స్థాయిలో స్పందన వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో వెల్లడించారు. ( Mantri anagani) ఈ సదస్సుల్లో భూములకు సంబంధించిన సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారని (AP Revenue Meetings Updates) ఆయన పేర్కొన్నారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, ప్రభుత్వం ఈ ఫిర్యాదులను చాలా సీరియస్గా తీసుకుని పరిష్కరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 2,34,665 వినతిపత్రాలు అందాయని మంత్రి వివరించారు. ప్రభుత్వం వీటిపై వేగంగా స్పందించి ఇప్పటికే 2,33,578 దరఖాస్తులను పరిష్కరించిందని ఆయన తెలిపారు. అంటే వచ్చిన ఫిర్యాదుల్లో దాదాపు అన్నింటినీ అధికారులు క్లియర్ చేశారని చెప్పారు. వీటిలో కేవలం 659 దరఖాస్తులు మాత్రమే ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించినవని ఆయన గుర్తుచేశారు.
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రాష్ట్రంలో భూ రికార్డులు తారుమారయ్యాయని మంత్రి అనగాని విమర్శించారు.
ఆ సమయంలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) కు వస్తున్న ఫిర్యాదుల్లో ఏకంగా 61 శాతం ఫిర్యాదులు ఒక్క రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. అందుకే భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేకంగా వర్క్ షాపులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. ప్రతి నెలా ఒకసారి ముఖ్యమంత్రి స్వయంగా రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహిస్తూ, పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారని చెప్పారు. రైతులు, సామాన్య ప్రజలు తమ భూముల విషయంలో ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. పారదర్శకమైన పాలన అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.