సొంత పార్టీలోనే అసహనం..
సొంత ఉచ్చులో రాహుల్?
రాని పుస్తకం.. రచ్చెక్కువ..
దేశంలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ఎదగాల్సిన రాహుల్ గాంధీ (Rahul Gandhi), అనవసరమైన అంశాల్లో తలదూర్చి తన రాజకీయ భవిష్యత్తును తనే ఇబ్బందుల్లో నెట్టేసుకుంటున్నారా? ఆయన వేస్తున్న ఎత్తుగడలు మోదీని ఇరికించడానికి బదులు, ఆయన్నే నవ్వుల పాలు చేస్తున్నాయా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే 'అవును' అనే సమాధానమే వినిపిస్తుందని రాజకీయ విశ్లేషణకు అభిప్రాయపడుతున్నారు.
పార్లమెంట్లో గత వారం రోజులుగా రాహుల్ గాంధీ చేస్తున్న హంగామా చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే రాసిన ఓ పుస్తకం గురించి ఆయన నానా రచ్చ చేశారు. అసలు విచిత్రం ఏంటంటే, ఆ పుస్తకం ఇంకా మార్కెట్లోకి రాలేదు, కేవలం ప్రీ-బుకింగ్ మాత్రమే జరుగుతోంది. చేతిలో పుస్తకం లేకుండా, అందులో ఏముందో తెలియకుండా పార్లమెంట్ను 8 రోజుల పాటు స్తంభింపజేయడం ఏంటని సొంత పార్టీ ఎంపీలే విసుగు చెందుతున్నారు. రాహుల్ వెనుక కూర్చున్న కాంగ్రెస్ నేతల ముఖాల్లో కనిపిస్తున్న నీరసమే దీనికి నిదర్శనం అని అభిప్రాయపడుతున్నారు.
నరవాణే పుస్తకం విషయంలో పప్పులో కాలేశానని అర్థం కాగానే, రాహుల్ రూటు మార్చారు. వెంటనే ఇండో-అమెరికా డీల్ (India-america Deal) గురించి అందుకున్నారు. భారతదేశాన్ని అమ్మేస్తున్నారంటూ పాత పల్లవినే అందుకున్నారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం చూపలేకపోతున్నారు. ఒకపక్క ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తుంటే, రాహుల్ మాత్రం విదేశీ శక్తుల స్క్రిప్టు చదువుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బడ్జెట్ లాంటి సీరియస్ విషయంలో రాహుల్ కంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఎంతో మెరుగ్గా మాట్లాడారు. చద్దా బడ్జెట్లోని లోపాలను ఎత్తిచూపుతూనే, అర్థవంతమైన విమర్శలు చేశారు. కానీ రాహుల్ మాత్రం బడ్జెట్ వదిలేసి 'జుడో-జుజుత్సు' లాంటి మార్షల్ ఆర్ట్స్ గురించి సభలో 10 నిమిషాల పాటు లెక్చర్లు ఇచ్చారు. అసలు సందర్భం ఏంటి? ఆయన మాట్లాడుతున్నదేంటి? అని స్పీకర్తో పాటు సొంత పార్టీ వాళ్లు కూడా తలలు పట్టుకున్నారు.
గతంలో అదానీ, అంబానీ అంటూ రాహుల్ గొంతు చించుకున్నప్పుడు విదేశాల నుంచి ఏదో ఒక రూపంలో సపోర్ట్ వచ్చేది. కానీ వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడంతో, రాహుల్ వల్ల మోదీని ఎదుర్కోవడం సాధ్యం కాదని విదేశీ మేధావులు కూడా ఫిక్స్ అయిపోయినట్లున్నారు. అందుకే ఈ మధ్య విదేశీ పర్యటనల్లో కూడా రాహుల్కు మునుపటి లాంటి ప్రాధాన్యత దక్కడం లేదు.
ప్రజా సమస్యల మీద పోరాడాల్సింది పోయి, కేవలం విమర్శల కోసమే విమర్శలు చేస్తూ రాహుల్ ఒక విదూషకుడిలా మారుతున్నారనే ఆందోళన రాజకీయ వర్గాల్లో ఉంది. లోక్సభలో విపక్ష నేత అంటే బాధ్యతాయుతంగా ఉండాలి కానీ, ఇలా తన చుట్టూ తానే ఉచ్చు బిగించుకుంటే రాబోయే 2029 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు కష్టాలు తప్పవేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.