- సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు..
- సేవాలాల్ స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధి…
Training ST students NEET & IITs: నీట్, ఐఐటీల్లో సీట్లు సాధించేలా గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు శిక్షణ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుల్లో ముందుంటున్నారని, ఉన్నత కొలువులు సాధించాలనే పట్టుదల వారిలో పెరిగిందన్నారు. భవిష్యత్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదని అభిప్రాయపడ్డారు.
సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. రూ.50 లక్షలు కేటాయించి సేవాలాల్ మహరాజ్ జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించుకుంటున్నామని, రానున్న రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ప్రసంగించారు.
సేవాలాల్ సిద్దాంతాలు ఎప్పటికీ ఆదర్శమే..
‘ఉమ్మడి అనంతపురం జిల్లా, గుత్తి మండలం, రామ్జీ నాయక్ తండాలో భీమా నాయక్, ధర్మణి మాత దంపతులకు సంత్ శ్రీ సేవాలాల్ జన్మించారు. సేవాలాల్ దూరమై శతాబ్ధాలు గడుస్తున్నా బంజారాల గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచారు. బంజారాలలో సేవాలాల్ చైతన్యాన్ని తీసుకొచ్చారు. ఆయన సిద్ధాంతాలు ఎప్పటికీ ఆదర్శంగా ఉంటాయి. దేశమంతా తిరిగి బంజారాలాను ఒకతాటిపైకి తీసుకొచ్చారు. సేవాలాల్ సేవలను నెమరువేసుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఆయన మన రాష్ట్రంలో జన్మించడం మన అదృష్టం. చిన్నతనం నుంచే సేవాలాల్ సామాజిక సేవతో మెలిగారు. ఎవరైనా ఆకలితో ఉంటే ఆయన వద్దునున్న ఆహారాన్ని పక్కవారికి ఇచ్చి ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి. జంతుబలిని వ్యతిరేకించారు. జంతువులను బలివ్వాలనుంటే ముందు నన్ను బలి ఇవ్వండని చెప్పారు. కానీ ఈ రోజుల్లో ఫోటోలకు జంతువులను బలిఇచ్చి హింసను సమర్థించుకునంటున్నారు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
గిరిజన బిడ్డల్లో పట్టుదల పెరిగింది
‘మహిళా సమానత్వం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటన్నాం. ఆనాడే స్త్రీ సమానత్వ ఆవశ్యకతను సేవాలాల్ చెప్పారు. తన జీవితాన్ని అరణ్యవాసులు, సంచార జాతులకోసం కేటయించారు. సంచార జీవనం కాకుండా తండాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించారు. సాయం చేయడం, ప్రకృతిని ప్రేమించడంతో పాటు ధర్మాన్ని పాటించాలని హిత బోధ చేశారు. ఆయన అందరికీ ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తారు. అదే విధంగా పేదల కోసం పని చేసిన వ్యక్తి ఎన్టీఆర్. గిరిజన పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి ఉన్నత విద్యను అందించాలని గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశారు. ఆ తర్వాత తండాలను అభివృద్ధి చేయాలని ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాం. గిరిజన ప్రాంతాలు మరింత అభివృద్ధి చేసేందుకు వారి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నాం.
అరకు కాఫీ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. గిరిజన ప్రాంతాల్లో వనరులకు కొదవలేదు..వాటిని సద్వివినియోగం చేసుకోవాలి. ఆదివాసీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసుతలు కల్పిస్తున్నాం. ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నాం. 2026-27 వార్షిక బడ్జెట్లో రూ.9,190 కోట్లు ఎస్టీల కోసం కేటాయించాం. సంత్ శ్రీ సేవాలాల్ లాంటి మహనీయుణ్ని నిత్యం తలచుకుని సమాజ హితం కోసం ప్రతి ఒక్కరం పని చేయాలి’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు మిరియాల శిరీషా దేవి, తోయక జగదీశ్వరి, చిర్రి బాలరాజు, గిరిజన నేతలు, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.