ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ఎంతో కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్ను పూర్తిగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను అమలు చేసింది. ముఖ్యంగా, రూ.10 లక్షల లోపు విలువ గల వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ను కేవలం రూ.100కి చేయాలన్న నిర్ణయం ప్రజల్లో విపరీతమైన హర్షాన్ని రేపుతోంది. ఈ నిర్ణయం చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఉపశమనం కలిగించడమే కాకుండా, అనవసరమైన ఆర్థికభారం తగ్గించబోతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవసరమైన మార్పులు పూర్తి కాగా, కొత్త విధానానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దీతో పాతపద్దతిలో ఎదురయ్యే ఆలస్యం, సాంకేతిక ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయి. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఈ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే విధంగా టెక్నాలజీని ఉపయోగించారని రెవెన్యూ శాఖ వివరించింది. మంగళవారం నుంచే కొత్త విధానం అమల్లోకి రావడంతో కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు విజయవంతంగా కూడా పూర్తయ్యాయని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.
వారసత్వ ఆస్తుల విలువ రూ.10 లక్షలు దాటినపక్షంలో కూడా ప్రజలకు భారం ఉండకుండా కేవలం రూ.1000 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత తక్కువ ధరకు వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ను అందించడం అరుదైన చర్యగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఎటువంటి అవినీతి, మధ్యవర్తితనం లేకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా, పాత రికార్డులు లేకపోవడంతో ఆస్తి హక్కులను నిర్ధారించడంలో ఇబ్బంది పడే వేలాదిమంది కుటుంబాలకు ఈ నిర్ణయం బలప్రదంగా మారనుంది.
రాష్ట్రంలోని చాలాచోట్ల వ్యవసాయ భూముల మార్కెట్ విలువ ఎకరానికి రూ.10 లక్షలకు లోపే ఉండటం వల్ల ఈ విధానం నెలకొల్పిన ప్రభావం మరింత విస్తృతంగా ఉండనుంది. తాజా నిర్ణయం ప్రకారం, రైతులు తమ ఆస్తులను చట్టబద్ధంగా తమ పేర్లకు లేదా వారసులకు మార్చుకోవడం మరింత సులభం కానుంది. దీంతో భూసంబంధిత వివాదాలు తగ్గి, న్యాయపరమైన సమస్యలు కూడా తగ్గే అవకాశముందని అధికారులు తెలిపారు. కొత్త విధానం వల్ల గ్రామాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ శాఖ అంచనా వేస్తోంది.