Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పట్టాలెక్కుతోంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజధాని పనులు ఇప్పుడు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా 16వ ఎస్ఐపీబీ (SIPB) సమావేశం తర్వాత రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. గడిచిన 22 నెలల కాలాన్ని పరిశీలిస్తే, ప్రభుత్వం సుమారు 264 భారీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా ఏకంగా రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. దీనివల్ల దాదాపు 9.60 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
ఇవే కాకుండా విశాఖపట్నం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా కుదిరిన ఒప్పందాలు మరో ఎత్తు. ఆ సదస్సులో కుదిరిన 538 ఎంఓయూల ద్వారా రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. మొత్తంగా చూస్తే, 802 ప్రాజెక్టుల ద్వారా రూ.20.74 లక్షల కోట్ల సంపద సృష్టి జరగబోతోంది. ఇది రాష్ట్ర భవిష్యత్తును మార్చేసే అతిపెద్ద మలుపుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజధాని అమరావతి విషయంలో గత కొన్నేళ్లుగా సాగిన వివాదాలకు ఇప్పుడు తెరపడింది. అమరావతికి చట్టబద్ధత రావడంతో ప్రజల్లో ఒక కొత్త ఆశ చిగురించింది. "నాడు జగన్ మోహన్ రెడ్డి హయాంలో పనులు ఆగిపోయాయి.. నేడు చంద్రబాబు నాయుడు మళ్ళీ పునాదులు వేస్తున్నారు" అనే చర్చ సామాన్య జనం మధ్య బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా, రాజధాని ప్రాంతంలో మళ్ళీ జేసీబీలు, క్రేన్లు తిరుగుతుండటంతో ఆ ప్రాంత రైతులు రియల్ ఎస్టేట్ రంగం ఊపిరి పీల్చుకున్నాయి.
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో జరిగిన జాప్యాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు ఏకైక రాజధానిగా అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. అమరావతిని కేవలం ఒక నగరంగా కాకుండా, 9 విశిష్ట నగరాల సమాహారంగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. ఇందులో అడ్మినిస్ట్రేషన్ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఫైనాన్స్ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ టూరిజం సిటీలు ఉంటాయి. ఇలాంటి విభిన్న క్లస్టర్లతో కూడిన రాజధాని ప్రపంచంలో మరెక్కడా లేదని ప్రభుత్వం చెబుతోంది.
ప్రతి రంగానికి ఒక ప్రత్యేక నగరం ఉండటం వల్ల ఆయా రంగాల్లోని నిపుణులు, కంపెనీలు అమరావతి వైపు ఆకర్షితులవుతారు. ఇది కేవలం పాలనా కేంద్రంగానే కాకుండా, రాష్ట్రానికి ఆర్థిక వనరులను పెంచే "గ్రోత్ ఇంజిన్" లా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.భౌగోళికంగా కూడా అమరావతికి ఉన్న సానుకూలతలు మరే నగరానికీ లేవు. కృష్ణా నది తీరాన ఉండటం వల్ల నీటి సమస్య తలెత్తే అవకాశమే లేదు. దానికి తోడు, దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు.
రేవు పట్టణాలకు కూడా ఈజీ యాక్సెస్ ఉండటం ఇన్వెస్టర్లకు పెద్ద ప్లస్ పాయింట్. ఎక్కడైతే నీరు, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉంటాయో, అక్కడికి పరిశ్రమలు క్యూ కట్టడం సహజం. దీనివల్ల స్థానిక యువతకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత రాష్ట్రంలోనే మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయి. ఐటీ రంగం నుంచి మాన్యుఫ్యాక్చరింగ్ వరకు అన్ని రంగాలకు అమరావతి వేదిక కాబోతోంది.
అమరావతి భూసేకరణపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోంది. రాజధాని కోసం లక్ష ఎకరాలు తీసుకుంటున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేస్తోంది. మొదటి దశలో 53,748 ఎకరాల భూమిని మాత్రమే రాజధాని నిర్మాణానికి కేటాయించారు. ఇందులో రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములే మెజారిటీ. ఇప్పుడు అవసరాల దృష్ట్యా మరో 16,667 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. కొందరు కావాలనే తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఏది ఏమైనా, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా, పారదర్శకంగా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని అధికార యంత్రాంగం పేర్కొంటోంది.