AP Kapu Welfare: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గ అభివృద్ధి కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. శుక్రవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదేనని కొనియాడారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన పథకాలను తిరిగి పునరుద్ధరించి, కాపు యువతకు అండగా నిలుస్తున్నామని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్లో సైతం కాపుల సంక్షేమానికి గతంలో కంటే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా సభకు వివరించారు.
విదేశీ విద్య విషయంలో గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 2014-19 మధ్యకాలంలో దాదాపు 1585 మంది కాపు విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.153 కోట్లకు పైగా ఖర్చు చేసిందని గుర్తు చేశారు. అయితే, గత ఐదేళ్లలో వైసీపీ కేవలం 81 మందికి మాత్రమే ఈ అవకాశం కల్పించిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్లో ఉన్న 331 మంది విద్యార్థుల బకాయిలను విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025-26) గాను కాపు సంక్షేమం కోసం రూ.5,571.48 కోట్లు కేటాయించినట్లు ఆమె వెల్లడించారు.
కాపు భవనాల నిర్మాణంపై స్పందిస్తూ.. గత ప్రభుత్వం వీటిని గాలికొదిలేసిందని మంత్రి సవిత ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ప్రారంభమైన ఈ భవనాల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం మళ్లీ వేగవంతం చేసిందని చెప్పారు. కేవలం నిధులు కేటాయించడమే కాకుండా, అవి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అందేలా చూస్తున్నామన్నారు. గతేడాది రూ.4,440 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది ఆ మొత్తాన్ని మరింత పెంచి కాపుల ఆర్థిక ఎదుగుదలకు బాటలు వేస్తున్నామని ఆమె వివరించారు.
యువతకు ఉపాధి కల్పనలో భాగంగా చేపట్టిన పథకాలను మంత్రి వివరించారు. ఆటో డ్రైవర్ల సేవా పథకం ద్వారా 25 వేల మందికి పైగా కాపు లబ్ధిదారులకు మేలు జరిగిందని, చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కాపు కుటుంబాలకు భృతి అందించామని చెప్పారు. ముఖ్యంగా మెగా డీఎస్సీ కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం వల్ల 54 మంది కాపు అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. నిరుద్యోగ యువతకు 50 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు ఈ బడ్జెట్లో రూ.217 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు.
మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత అన్నారు. చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద 10,300 మందిని, ఎంఎస్ఎంఈ గ్రూపుల ద్వారా మరికొంతమందిని గుర్తించి వారికి ఆర్థిక చేయూతనిస్తున్నామని చెప్పారు. అలాగే 11 వేల మందికి పైగా కాపు మహిళలకు ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇచ్చి, వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. కాపుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ఆమె పునరుద్ఘాటించారు