ఒక సీఎంను అవమానించడం అంటే కోట్లాది ప్రజలను అవమానించడం కాదా?
చట్టం, కోర్టులంటే భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలి..
సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, ప్లెక్సీల వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. వాదనలు పూర్తయ్యాక ఈ కేసులో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
విచారణలో భాగంగా, “2029లో మీరు చేసే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం” అనే వ్యాఖ్యలతో ప్లెక్సీలు ఏర్పాటు చేయడంపై న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. “ఇలాంటి ప్లెక్సీలు పెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఎవరిని విధ్వంసం చేస్తారు? రాష్ట్రాన్నా? లేక రాష్ట్ర ప్రజలనా?” అంటూ ప్రశ్నించింది.
అలాగే, ముఖ్యమంత్రిని అవమానించడం అంటే రాష్ట్ర ప్రజల భావాలను దెబ్బతీయడమేనని కోర్టు స్పష్టం చేసింది. “ఒక సీఎంను అవమానించడం అంటే కోట్లాది ప్రజలను అవమానించడం కాదా?” అని ప్రశ్నిస్తూ, వ్యక్తిగతంగా మరియు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించింది.
“అవమానించేలా మాట్లాడే హక్కు, పోస్టులు పెట్టే అధికారం ఎవరిచ్చారు? వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు” అంటూ హైకోర్టు కఠినంగా వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంలో పోలీసుల పనితీరుపైనా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితులు మళ్లీ రావని పేర్కొంది. “చట్టం, కోర్టులంటే భయం కలిగేలా పోలీసుల చర్యలు ఉండాలి. పోలీసులు కఠినంగా వ్యవహరించి ఉంటే 2024 తర్వాత కూడా ఇలాంటి పోస్టులు పెట్టే ధైర్యం వచ్చేదే కాదు” అని కోర్టు వ్యాఖ్యానించింది.
అభ్యంతరకర సోషల్ మీడియా పోస్టుల కేసులను డీల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అన్ని వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పును హైకోర్టు త్వరలో వెలువరించనుంది.
అలాగే, సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన వ్యవహారం అవసరమని, వ్యక్తిగత అవమానాలు, దూషణలు సహించబోమని హైకోర్టు స్పష్టమైన సందేశం ఇచ్చింది.