ఆంధ్రప్రదేశ్ 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు సంబంధించిన కీలక దిశానిర్దేశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఒక ముఖ్యమైన ప్రీ–బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, శాఖల వారీగా నిధుల కేటాయింపులు, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) వృద్ధి స్థితి వంటి అంశాలను సీఎం లోతుగా సమీక్షించనున్నారు. అలాగే RTGS వ్యవస్థ అమలు పురోగతి, పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ స్థితిగతులు, ప్రభుత్వ పథకాల భౌతిక–ఆర్థిక పురోగతిపై సమగ్ర అవలోకనం చేయనున్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు వర్చువల్ విధానంలో హాజరుకానున్నారు.
ఈ ప్రీ–బడ్జెట్ సమావేశంలో శాఖల వారీగా, జిల్లాల వారీగా ప్రాధాన్యతా అభివృద్ధి ప్రాజెక్టులను గుర్తించడం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా, మౌలిక వసతులు బలోపేతం చేసే ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత కల్పించనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రీ–బడ్జెట్ సమావేశంలో రాష్ట్రం తరఫున కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కేంద్ర బడ్జెట్తో రాష్ట్ర బడ్జెట్ అనుసంధానంగా ఉండేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు, నదుల అనుసంధాన పథకాలు, అలాగే రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక నిధుల కేటాయింపులు ఈ సమీక్షలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. అంతేకాదు, 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యేకంగా నీటి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనపై కూడా చర్చ జరగనుంది. సాగునీరు, త్రాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ను రూపొందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇదే సమయంలో విశాఖపట్నం ఆర్థిక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రానికి కేంద్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనను కూడా సీఎం సమీక్షించనున్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో, అధిక రెవెన్యూ గ్రాంట్లు, పన్నుల పంపిణీ ద్వారా రాష్ట్రానికి లభించే అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడంపై చర్చ జరగనుంది. అలాగే సాస్కి, పూర్వోదయ పథకాల కింద మూలధన పెట్టుబడులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీలు, రాయలసీమ హార్టికల్చర్ ప్రణాళికల అమలుపై శాఖలకు సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.