దేశ సరిహద్దులను మరింత అభేద్యంగా మార్చనున్న ‘స్మార్ట్ బోర్డర్’ ప్రాజెక్ట్..
అక్రమ చొరబాట్లు అరికట్టేందుకు స్మార్ట్ టెక్నాలజీ వినియోగం..
దేశ సరిహద్దులను మరింత అభేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే “స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టు” ప్రారంభించనుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. డ్రోన్లు, రాడార్లు, ఆధునిక కెమెరాలు వంటి సాంకేతిక పరికరాలతో సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
స్మార్ట్ బోర్డర్ కాన్సెప్ట్లో భాగంగా అన్ని రకాల సాంకేతిక వ్యవస్థలను బీఎస్ఎఫ్ భద్రతా విధానంలో కలిపి వచ్చే ఏడాది లోపు అత్యంత కట్టుదిట్టమైన సరిహద్దు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. దేశ భద్రత అనేది కేవలం సరిహద్దులకే పరిమితమైన విషయం కాదని, అది దేశ భౌగోళిక సమగ్రతకు సంబంధించిన పెద్ద బాధ్యత అని ఆయన అన్నారు.
అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్త భద్రతా సవాళ్లు దేశానికి ప్రమాదంగా మారుతున్నాయని అమిత్ షా హెచ్చరించారు. ఈ పరిస్థితులను ఎదుర్కోవాలంటే రాష్ట్ర పోలీస్ శాఖలు, కేంద్ర బలగాలు, ఇంటెలిజెన్స్ సంస్థలు, స్థానిక పరిపాలనా వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
1965లో కేవలం 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో ప్రారంభమైన బీఎస్ఎఫ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు భద్రతా దళంగా ఎదిగిందని ఆయన కొనియాడారు. ప్రస్తుతం దాదాపు 2 లక్షల 70 వేల మంది సిబ్బందితో బీఎస్ఎఫ్ దేశ భద్రతలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
అంతేకాకుండా, బీఎస్ఎఫ్ పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు విస్తరించినట్లు ఆయన తెలిపారు. చొరబాట్లను అడ్డుకోవడమే కాకుండా, దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారిని గుర్తించి తిరిగి పంపించే చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటోందని స్పష్టం చేశారు. దేశ సరిహద్దుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను పెద్ద ఎత్తున వినియోగించేందుకు సిద్ధమవుతుండగా, “స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టు” భవిష్యత్తులో భారత భద్రతా వ్యవస్థలో కీలక మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు.