ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇటీవలే వీటి ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయగా, ఇందులో భాగంగా మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా కూడా ఏర్పాటు అయింది. తాజా సమాచారం ప్రకారం, ఈ జిల్లాలో పరిపాలనను 2026 జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి శాఖలవారీగా ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్కు స్పష్టమైన సూచనలు అందినట్లు తెలుస్తోంది.
కొత్త జిల్లాలో పరిపాలన ప్రారంభించడానికి అవసరమైన కార్యాలయాల స్థలాల ఎంపికపై జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కొత్త జిల్లా కలెక్టరేట్గా ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే ఇటీవల ప్రారంభించిన డీఎల్డీవో కార్యాలయంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. మొత్తం పరిపాలనకు కావలసిన విభాగ కార్యాలయాలను ఒకదాని తర్వాత మరొకటి ఖరారు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జిల్లా కేంద్రంలో సుమారు 60 ప్రభుత్వ విభాగాలు ఉండనుండగా, వీటిలో దాదాపు 50% కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు. మిగతా కార్యాలయాల కోసం మదనపల్లెలోని బీటీ కాలేజ్, జీఎంఆర్ పాలిటెక్నిక్ వంటి భవనాలను తాత్కాలికంగా వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. ఇవి సరిపోకపోతే ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకునే ప్రణాళికను కూడా పరిశీలిస్తున్నారు.
జిల్లా పోలీసు విభాగానికి సంబంధించిన కార్యాలయ స్థలం ఇంకా ఖరారు కాలేదు. అయితే, త్వరలోనే అన్ని విభాగాల కార్యాలయాల ఎంపిక పూర్తి చేసి ఆ నివేదికను ప్రభుత్వానికి పంపే అవకాశం ఉంది. ఇదిలావుండగా, జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను కొత్త జిల్లాలోని బీటీ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
కొత్త మదనపల్లె జిల్లాలో మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాలు ఉన్నాయి. పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మదనపల్లె జిల్లాలోకి జోడించబడినా, అది చిత్తూరు రెవెన్యూ డివిజన్ కిందకు రావడం వల్ల స్థానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మండలాన్ని పీలేరు రెవెన్యూ డివిజన్లో చేర్చాలంటూ డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.