ప్రస్తుతం మన దేశంలో చాలా మందిని కలవరపెడుతున్న విషయం ఏమిటంటే, అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి విలువ పడిపోవడం. రూపాయి విలువ 84 దాటి 90 వైపు వెళ్తుండటంతో, సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన మొదలైంది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా? వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయా? అన్న సందేహాలు వస్తున్నాయి. అయితే, దీని వెనుక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక సీక్రెట్ స్ట్రాటజీని అమలు చేస్తోందని అంతర్జాతీయ పత్రికలు చెబుతున్నాయి.
నిజంగా ధరలు పెరుగుతున్నాయా?
సాధారణంగా రూపాయి విలువ పడిపోయినప్పుడు, మనం విదేశాల నుండి కొనే వస్తువుల (ముఖ్యంగా పెట్రోల్, డీజిల్) ధరలు పెరుగుతాయి. ఎందుకంటే మనం చమురును డాలర్లలో కొంటాము. కానీ మీరు గమనిస్తే, గత ఏడాది కాలంగా రూపాయి విలువ తగ్గినా, రోడ్డు మీద పెట్రోల్ ధరల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇది ఎలా సాధ్యం? దీనికి కారణం మనం రష్యా వంటి దేశాల నుండి చౌకగా చమురు కొనడం మరియు డాలర్ల అవసరం లేకుండా మన లోకల్ కరెన్సీలో వ్యాపారం చేయడమే.
ఆర్బీఐ అనుసరిస్తున్న కొత్త విధానం…
గతంలో శక్తికాంత దాస్ గారు రూపాయిని 84 వద్ద స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. కానీ ప్రస్తుత సంజయ్ మల్హోత్రా వంటి అధికారులు "లీనింగ్ టు ద విండ్" (Leaning to the wind) అనే పద్ధతిని పాటిస్తున్నారు. అంటే గాలి ఎటు వీస్తే అటు వంగే చెట్టులాగా, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రూపాయి విలువను అలో చేస్తున్నారు. రూపాయి విలువ తగ్గడం వల్ల మన దేశం నుండి వస్తువులను ఎగుమతి చేసే వారికి లాభం చేకూరుతుంది, ఎందుకంటే విదేశీయులకు మన ఉత్పత్తులు చౌకగా దొరుకుతాయి.
డాలర్కు చెక్ పెట్టే ‘డీ-డాలరైజేషన్’..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా "డీ-డాలరైజేషన్" (De-dollarization) గురించి చర్చ జరుగుతోంది. అంటే వ్యాపారాల్లో డాలర్ వాడకాన్ని తగ్గించడం. భారత్ ఇప్పటికే రష్యాతో కలిసి 'వాస్త్రో అకౌంట్స్' ద్వారా మన సొంత కరెన్సీలో ట్రేడింగ్ చేస్తోంది. అమెరికా రాయబారులు కూడా ఆర్బీఐ గవర్నర్ను కలిసి, భారత్ ఏమైనా కొత్త బ్రిక్స్ (BRICS) కరెన్సీని లేదా డిజిటల్ కరెన్సీని తీసుకువస్తోందా అని ఆరా తీస్తున్నారు. ఇది ఒక రకమైన 'డబల్ గేమ్' లాగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మన ఫారెక్స్ నిల్వలు పదిలం..
మన ఆర్థిక పరిస్థితి ప్రమాదంలో ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారత్ వద్ద ఇప్పటికీ 686 బిలియన్ డాలర్ల అత్యధిక విదేశీ మారక నిల్వలు (Forex Reserves) ఉన్నాయి. ఒకవేళ రూపాయిని కాపాడాలనుకుంటే ఆర్బీఐ ఈ డాలర్లను అమ్మేసి రూపాయిని స్థిరపరచగలదు, కానీ ఆర్బీఐ ఆ పని చేయడం లేదు. అంటే రూపాయి 90 లేదా 95 వరకు వెళ్లినా మన నిల్వలను కాపాడుకుంటూనే, ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతున్నారన్నమాట,.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ రాకతో మారుతున్న ఆర్థిక విధానాల వల్ల ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే ఇది కేవలం ఒక తాత్కాలిక దృగ్విషయం (Temporary phenomenon) మాత్రమే, మన నిపుణులకు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో బాగా తెలుసు. కాబట్టి రూపాయి పతనం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఇది దేశ ఆర్థిక భవిష్యత్తు కోసం చేస్తున్న ఒక పెద్ద ప్రయోగం కావొచ్చు.