AP Social Welfare Department: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. పేద విద్యార్థుల చదువులకు వెన్నుముకగా నిలుస్తున్న 'జ్ఞానభూమి' పోర్టల్కు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక స్కోచ్ (SKOCH) అవార్డు లభించింది. ప్రభుత్వ సేవలను డిజిటల్ రూపంలో అత్యంత పారదర్శకంగా, వేగంగా ప్రజలకు చేరవేస్తున్నందుకు గానూ ఈ పురస్కారం దక్కింది. ఈ విజయం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 28వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరగనుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ అధికారిణి బి. లావణ్య వేణి ఈ వేడుకలో పాల్గొని ప్రభుత్వ తరపున అవార్డును అందుకోనున్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి, సాంకేతికతను జోడించి సేవలను సులభతరం చేసినందుకు ఈ గుర్తింపు రావడం విశేషం.
ముఖ్యంగా జ్ఞానభూమి పోర్టల్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోంది. గతంలో స్కాలర్షిప్లు లేదా హాస్టల్ అడ్మిషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్ ద్వారా అప్లై చేసుకున్న వెంటనే పనులు పూర్తవుతున్నాయి. ప్రీ-మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లతో పాటు విదేశీ విద్య (అంబేద్కర్ ఓవర్సీస్), సివిల్స్ కోచింగ్ వంటి కీలక సేవలను ఈ పోర్టల్ ద్వారానే అందిస్తున్నారు.
కేవలం ఆర్థిక సాయం అందించడమే కాకుండా, ఉత్తమ పాఠశాలల్లో ప్రవేశాలు, హాస్టల్ వసతి కల్పనలో కూడా ఈ వేదిక పారదర్శకతను పెంచింది. దీనివల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా విద్యార్థులకే ప్రయోజనం అందుతోంది. విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన ఈ విప్లవాత్మక మార్పులే ఈరోజు జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు రావడానికి ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా మంత్రి డి.ఎస్.బి.వి. స్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థుల సంక్షేమం కోసం తమ శాఖ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. శాఖా పరంగా కృషి చేసిన ప్రతి ఉద్యోగికి ఈ గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.