ప్రతీకారం తీర్చుకుంటాం ఇరాన్ కేబినెట్ హెచ్చరిక
కొత్త వారసుడిగా కుమారుడు..
శంషాబాద్లో 22 విమానాలు రద్దు..
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ధృవీకరించాయి. ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారని, ఒక గొప్ప విప్లవ నాయకుడిని దేశం కోల్పోయిందని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. పవిత్ర రంజాన్ మాసంలో ఈ విషాదం చోటు చేసుకోవడం ఇరాన్ వాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఖమేనీ మృతిని ఇరాన్ కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఇదొక 'మహానేరం' అని అభివర్ణించిన ప్రభుత్వం, దీని వెనుక ఉన్న శక్తులకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని రివల్యూషనరీ గార్డ్స్ స్పష్టం చేశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరం కావడంతో మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన మొదలైంది. ఖమేనీ మృతికి ప్రతిగా ఇరాన్ నుంచి భారీ దాడులు జరిగే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, ఖమేనీ మరణించిన కొద్ది గంటల్లోనే ఇరాన్ తదుపరి వారసుడిని ప్రకటించింది. ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా నియమించారు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా పాలనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఇరాన్ మిలిటరీ శక్తి అయిన ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వహిదీ బాధ్యతలు చేపట్టారు.ఒకవేళ ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభిస్తే, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం సెగ హైదరాబాద్కు కూడా తాకింది. గగనతలంలో యుద్ధ విమానాల సంచారం, క్షిపణి దాడుల భయంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశీ విమాన సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన విమానాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దుబాయ్, మస్కట్, అబుదాబి వంటి నగరాలకు వెళ్లాల్సిన సుమారు 22 విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి చక్కబడే వరకు విమానాల రాకపోకలపై అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది