మస్కట్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడికి అరుదైన గౌరవం..
భారత రాయబారి చేతుల మీదుగా ప్రశంసా పత్రం..
మస్కట్: ఒమాన్ రాజధాని మస్కట్లోని భారత రాయబారి కార్యాలయం నిర్వహించిన కమ్యూనిటీ ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువకుడు విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం కూనవరం గ్రామానికి చెందిన బొంతు నాగరాజుకు భారత రాయబారి కార్యాలయం ప్రశంసా పత్రాన్ని అందజేసింది.
ఈ సర్టిఫికెట్ను భారత రాయబారి జీవీ శ్రీనివాస్ చేతుల మీదుగా నాగరాజు ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. ఇటీవల ఒమాన్లో జరిగిన వి.వి.ఐ.పి (VVIP) పర్యటనను విజయవంతంగా నిర్వహించడంలో ఆయన చూపిన అంకితభావం, కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.
ఈ సందర్భంగా భారత రాయబారి కార్యాలయం నాగరాజు సేవలను ప్రత్యేకంగా ప్రశంసించింది. స్వచ్ఛంద సేవా భావంతో ఆయన చేసిన సహకారం కార్యక్రమం సాఫీగా సాగేందుకు కీలకంగా మారిందని పేర్కొంది. ప్రవాస భారతీయుల మధ్య స్నేహబంధాన్ని బలోపేతం చేయడంలో నాగరాజు ముఖ్య పాత్ర పోషించారని తెలిపింది.
మస్కట్ లో తెలుగువారికి ఎలాంటి కస్టమ్ వచ్చినా ముందుగా స్పందించి టీం సభ్యులతో సమన్వయం చేసుకుంటూ, చేయగలిగిన సహాయం అందించడంలో నాగరాజు ముందంజలో ఉంటారు. ఏజెంట్ ల చేతుల్లో మోసపోయిన మెయిడ్ లకు అండగా ఉంటూ, భారత్ లోని ఎన్నారై టీడీపీ మరియు ఏపీ ఎన్నార్టీ తో సంప్రదింపులు జరిపి ఏజెంట్ తో మాట్లాడి వారికి న్యాయం జరగడం కోసం పోరాడతారు.
విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతి, ఆత్మీయతను చాటిచెప్పేలా నాగరాజు చేసిన ప్రయత్నాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని రాయబారి కార్యాలయం అభినందించింది. ఆయన కృషి ప్రవాసులందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడింది.
ఒక సాధారణ గ్రామానికి చెందిన యువకుడు అంతర్జాతీయ వేదికపై ఈ స్థాయి గౌరవం అందుకోవడం పట్ల కూనవరం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
సేవా భావం, కృషి ఉంటే ఎక్కడైనా గుర్తింపు దక్కుతుందనే విషయాన్ని నాగరాజు మరోసారి నిరూపించారు. విదేశాల్లో తెలుగు యువత ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన ఈ సంఘటన అందరికీ గర్వకారణంగా మారింది.
ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికపై ఈ స్థాయి గౌరవం దక్కించుకున్న బొంతు నాగరాజు కు ఆంధ్రప్రవాసి తరపున హృదయపూర్వక అభినందనలు.