- గిన్నిస్ రికార్డుపై కన్నేసిన సిలికాన్ ఆంధ్ర: 1800 మందితో సామూహిక 'శతక శంఖారావం'!
- 300 మంది గాయకులతో లలిత గీతాల సందడి.. రామాచారి నేతృత్వంలో 'లలిత గీతామృత వర్షిణి'..
Andhra celebrations in California: సిలికాన్ ఆంధ్ర జగమంత కుటుంబం 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. అమెరికాలోని కాలిఫోర్నియా, ఓక్ ల్యాండ్ లో ఆగస్టు 8 శనివారం ఈ కార్యక్రమం జరపనున్నారు. గత 25 ఏళ్లుగా తెలుగు సంస్కృతి, భాష పరిరక్షణకు కట్టుబడి ఉన్న ఈ సంస్థ, ప్రవాస తెలుగువారిని తమ మూలాలతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మైలురాయిని పురస్కరించుకుని భారతీయ, తెలుగు సంస్కృతీ వైభవాన్ని చాటిచెప్పేలా అనేక ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది.
సంగీతామృత వర్షిణి..
కర్ణాటక సంగీత విద్వాంసుల కోసం పంచ రత్న మాలిక అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. అన్నమయ్య, క్షేత్రయ్య, రామదాసు, త్యాగరాజు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి ఐదుగురు దిగ్గజ వాగ్గేయకారుల కీర్తనలను. ఈ విభాగంలో ఆలపిస్తారు.
లయామృత వర్షిణి..
మృదంగ విద్వాంసుల కలయికతో సుమారు 300 మంది కళాకారులతో సింఫనీ ఆఫ్ పర్కషన్ నిర్వహించనున్నారు. 'పద్మశ్రీ' ఎల్లా వెంకటేశ్వరరావు నేతృత్వంలో దేవ వాద్యమైన మృదంగం ఘోషను ఈ కచేరీలో ఆస్వాదించవచ్చు.
కూచిపూడి నృత్యామృత వర్షిణి..
సిలికాన్ ఆంధ్ర వైజయంతి మహా బృంద నాట్యం పేరుతో వందలాది మంది కూచిపూడి కళాకారులు పాల్గొనే భారీ ప్రదర్శనను ఈ వేడుకల్లో భాగంగా ప్రదర్శించనున్నారు.
లలిత గీతామృత వర్షిణి..
పాలగుమ్మి, బాలాంత్రపు వంటి ప్రముఖ రచయితల గీతాలను సుమారు 300 మంది గాయకులు రామాచారి నేతృత్వంలో ఆలపించి ప్రేక్షకులను అలరించనున్నారు.
శతక శంఖారావం..
వేమన, సుమతీ శతకాలలోని 18 పద్యాలను 1,800 మంది ప్రతినిధులతో సామూహికంగా పఠనం చేయించడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించేందుకు సిలికాన్ ఆంధ్ర సిద్ధమైంది.
జానపద జాతర..
తెలుగు గ్రామీణ సంస్కృతికి అద్దంపట్టేలా డప్పు, లంబాడి, పులివేషాలు, కొమ్ముకోయ, గొండు, గుస్సాడీ వంటి వైవిధ్యమైన జానపద కళారూపాలను ఈ జాతరలో ప్రదర్శించనున్నారు.
వందే భారతం..
భారతదేశ విశిష్టతను, ప్రాచీన వైభవాన్ని చాటిచెప్పేలా సెమీ క్లాసికల్, ఆధునిక నృత్య సమ్మేళనాన్ని ఈ విభాగంలో చూడవచ్చు.