Telangana Education: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదివే విద్యార్థులకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. పేద విద్యార్థుల చదువుకు ఆసరాగా నిలిచేలా ఏకంగా 24 రకాల వస్తువులతో కూడిన 'మెగా ఎడ్యుకేషన్ కిట్లను' పంపిణీ చేయాలని నిర్ణయించింది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, విద్యార్థికి అవసరమైన ప్రతి చిన్న వస్తువును ఈ కిట్ ద్వారా అందించడం విశేషం. సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా పాఠశాలలు, గిరిజన విద్యా సంస్థల్లో చదువుతున్న సుమారు 5 లక్షల మంది విద్యార్థులకు ఈ నిర్ణయంతో నేరుగా లబ్ధి చేకూరనుంది.
ఈ ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్లలో విద్యార్థుల నిత్యవసరాలైన స్కూల్ యూనిఫాం, వైట్ డ్రెస్, షూస్, సాక్సులతో పాటు వసతి గృహాల్లో ఉండేవారి కోసం బెడ్ షీట్, బ్లాంకెట్, టవల్, నైట్ డ్రెస్ వంటి వస్తువులను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. అంతేకాకుండా రోజూ ఉపయోగించే ప్లేట్, గ్లాస్, స్పూన్, ట్రంక్ బాక్స్ పూర్తి స్థాయి స్టేషనరీ సామాగ్రిని కూడా ఇందులో పొందుపరిచారు. ఈ కిట్ అందడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం భారీగా తగ్గడమే కాకుండా, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఈ భారీ ప్రాజెక్ట్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రభుత్వం పక్కాగా ప్లాన్ చేస్తోంది. మొత్తం 24 వస్తువులను 9 కేటగిరీలుగా విభజించి విడివిడిగా టెండర్లను ఆహ్వానించింది. ఎంపికైన కాంట్రాక్టర్లు కేవలం 45 రోజుల్లోపే ఈ సామాగ్రిని సరఫరా చేయాలని నిబంధన విధించింది. ఒకవేళ వస్తువుల నాణ్యతలో లోపాలున్నా లేదా సరఫరాలో ఆలస్యమైనా భారీగా జరిమానాలు విధించడంతో పాటు, సంబంధిత సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెడతామని ప్రభుత్వం హెచ్చరించింది. అక్రమాలకు తావులేకుండా ప్రతి వస్తువుపై బార్ కోడ్ను కూడా కేటాయిస్తున్నారు.
మరోవైపు, డే స్కాలర్ విద్యార్థులకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 19 లక్షల మంది విద్యార్థులకు కొత్తగా బ్లాక్ షూస్, రెండు జతల సాక్సులు మరియు బెల్టులను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. గతంలో చాలా మంది విద్యార్థులు చెప్పులు లేకుండా పాఠశాలలకు వెళ్తున్న విషయాన్ని గమనించిన సర్కార్, ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ సమస్యకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించినట్లు సమాచారం.
వచ్చే 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ముందే ఈ కిట్ల పంపిణీ పూర్తి చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇప్పటికే విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశంలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లలో వసతులు కల్పించడం ద్వారా డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద విద్యార్థుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోంది.