మహిళా సాధికారత టీడీపీ జీన్స్లోనే ఉంది: మాధవిరెడ్డి..
మహానాడులో మహిళలకు టీడీపీ భారీ ప్రాధాన్యం..
టీడీపీ మహానాడు వేదికగా మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం మహిళా సాధికారత దిశగా చారిత్రాత్మక అడుగని ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవిరెడ్డి పేర్కొన్నారు. శనివారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె విస్తృతంగా మాట్లాడారు. మహిళా సాధికారత అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్లోనే ఉందని, టీడీపీ మాటల్లో కాకుండా చేతల్లో నిరూపించిందని స్పష్టం చేశారు.
2026 మహానాడును మహిళా సాధికారతకు అంకితం చేస్తూ, పార్టీ పదవుల్లోనే కాకుండా రాబోయే ఎన్నికల్లో కూడా మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని యువనేత నారా లోకేష్ ప్రకటించడం మహిళల రాజకీయ భవిష్యత్తుకు కొత్త దిశ చూపిందన్నారు. చట్టం అమలులోకి రాకముందే స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్న దేశంలోని ఏకైక పార్టీ టీడీపీ అని ఆమె పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేవేగౌడ, అటల్ బిహారీ వాజపేయి కాలం నుంచే టీడీపీ ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇస్తోందని గుర్తు చేశారు. మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “నారీ శక్తి వందన్” చట్టాన్ని కూడా ఆమె అభినందించారు. అదే స్ఫూర్తితో టీడీపీ ముందడుగు వేసిందన్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ మహిళల అభ్యున్నతికి అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం ద్వారా సామాజిక న్యాయానికి బాటలు వేసారని మాధవిరెడ్డి చెప్పారు. అనంతరం చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసి మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచారని వివరించారు. మహిళా విశ్వవిద్యాలయాల ఏర్పాటు, డ్వాక్రా సంఘాల బలోపేతం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకున్న చర్యలు వారి జీవితాల్లో పెద్ద మార్పు తీసుకువచ్చాయని అన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో లక్షలాది మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. దాదాపు 12 లక్షల డ్వాక్రా గ్రూపుల ద్వారా కోటి మందికిపైగా మహిళలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించామని చెప్పారు. బ్యాంక్ లింకేజీ ద్వారా రూ.68 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. మహిళల్లో ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం రైతు రుణాలు, వీధి వ్యాపారుల రుణాలను కూడా స్వయం సహాయక సంఘాల ద్వారానే అందిస్తోందన్నారు.
“దీపం 2.0” పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు అందుతున్నాయని, “స్త్రీ శక్తి” పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు నెలకు వేల రూపాయలు ఆదా అవుతున్నాయని చెప్పారు. కడపలో ఒక నర్సు ఉదాహరణ చెబుతూ, ఉచిత బస్సు ప్రయాణంతో ఆమెకు నెలకు రూ.1,500 మిగులుతున్నాయని తెలిపారు. ఆ డబ్బు పిల్లల చదువులకు, కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతోందన్నారు.
అలాగే, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లకు పైగా జమ చేశామని పేర్కొన్నారు. ఈ పథకాల వల్ల ఆడపిల్లల స్కూల్ డ్రాపౌట్స్ తగ్గుతున్నాయని, విద్యార్థినుల సంఖ్య పెరుగుతోందన్నారు.
మహిళల శ్రమకు సరైన గుర్తింపు రావడం లేదని మాధవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో మహిళలు సగం ఉన్నప్పటికీ, జీడీపీలో వారి భాగస్వామ్యం కేవలం 18 శాతంగానే నమోదు అవుతోందన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, కుటుంబ వ్యాపారాలు, ఇంటి పనుల్లో మహిళలు చేస్తున్న “అన్పెయిడ్” శ్రమను కూడా లెక్కిస్తే వారి ఆర్థిక భాగస్వామ్యం 30 శాతం దాటుతుందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు, సోషల్ మీడియా ట్రోలింగ్ అధికమయ్యాయని ఆరోపించారు. తాను కూడా గత ప్రభుత్వంలో సోషల్ మీడియా వేధింపులకు గురయ్యానని తెలిపారు. మహిళలను మానసికంగా వేధించి రాక్షసానందం పొందారని మండిపడ్డారు. ఇప్పుడు మహిళలు తిరగబడే పరిస్థితి వచ్చిందని, రాబోయే రోజుల్లో మహిళలే చట్టసభల్లోకి భారీగా అడుగుపెడతారని అన్నారు.
మహిళల ఆరోగ్యంపై కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. “సఖీ సురక్ష” కార్యక్రమం కింద లక్షలాది మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించామని, అందులో వేలాది మందికి వ్యాధులు ముందుగానే గుర్తించగలిగామని చెప్పారు. పేద మహిళలకు ఇది ప్రాణ రక్షణలా మారిందన్నారు.
టీడీపీ తీసుకున్న 33 శాతం మహిళా రిజర్వేషన్ నిర్ణయం దేశ రాజకీయాలనే మార్చేస్తుందని మాధవిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ఇకపై జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ మహిళలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వక తప్పదన్నారు. 2029 ఎన్నికలకంటే ముందే మహిళా రిజర్వేషన్ పూర్తి స్థాయి చట్టంగా మారే పరిస్థితిని టీడీపీ సృష్టించిందని చెప్పారు.
మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్కు రాష్ట్ర మహిళా లోకం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో మహిళల ఆధ్వర్యంలో విప్లవాత్మక మార్పులు తప్పక వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.