సరైన వివరాలు లేకుండా పునర్విభజన ఎలా చేస్తారు?..
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలు తెచ్చేలా కేంద్రం వ్యవహరించింది..
న్యూఢిల్లీ: దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియపై సీపీఐ నేత నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జనగణన పూర్తి చేయకుండా నియోజకవర్గాల పునర్విభజన చేయడం సరైంది కాదని ఆయన స్పష్టం చేశారు.
“సరైన గణాంకాలు లేకుండా డీలిమిటేషన్ ఎలా చేస్తారు?” అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నారాయణ, ఈ ప్రక్రియలో రాష్ట్రాల మధ్య సమతుల్యత తప్పిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలు తెచ్చేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
రాజ్యాంగ సవరణకు అవసరమైన మెజార్టీ కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి లేదని నారాయణ పేర్కొన్నారు. అయినప్పటికీ మహిళా బిల్లును ముందుకు తెచ్చి, దానిని ఉపయోగించి డీలిమిటేషన్ చేపట్టాలని ప్రయత్నించడం రాజకీయ కుట్రగా అభివర్ణించారు.
మహిళల అంశాన్ని ముందుకు పెట్టి, వారి పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కేంద్రం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. “మహిళలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ చేయాలనుకున్నారు” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
అయితే, ఈ ప్రయత్నాలను విపక్ష పార్టీలు సమర్థంగా అడ్డుకున్నాయని నారాయణ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి నిర్ణయాలు పారదర్శకంగా, సమగ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. డీలిమిటేషన్ వంటి కీలక అంశాల్లో అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని నారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.