భారత రైల్వే శాఖ నిరుద్యోగ యువతకు భారీ శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ఆధ్వర్యంలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC – Graduate) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,810 గ్రాడ్యుయేట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు దేశంలోని అన్ని రైల్వే రీజియన్లలో జరుగుతాయి. దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ పోస్టులలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 20, 2025లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
రీజియన్ల వారీగా పోస్టుల సంఖ్యను పరిశీలిస్తే — బిలాస్పూర్ రీజియన్లో అత్యధికంగా 864 ఖాళీలు, కోల్కతాలో 685, రాంచీలో 651, ముంబయిలో 596, మాల్దాలో 522, సికింద్రాబాద్లో 396 పోస్టులు ఉన్నాయి. ఇతర రీజియన్లలో అహ్మదాబాద్లో 79, అజ్మేర్లో 345, బెంగళూరులో 241, భువనేశ్వర్లో 231, చెన్నైలో 187, చండీగఢ్లో 199, గువాహటిలో 56, గోరఖ్పుర్లో 111, జమ్ము & శ్రీనగర్లో 32, కడపలో 23, తిరువనంతపురంలో 58 పోస్టులు ఉన్నాయి. డిగ్రీతో పాటు టైపింగ్ ప్రావీణ్యం ఉన్నవారు మాత్రమే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, సీనియర్ క్లర్క్ పోస్టులకు అర్హులు. వయస్సు పరిమితి జనవరి 1, 2026 నాటికి 18–33 ఏళ్ల మధ్య ఉండాలి. వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250గా నిర్ణయించారు. ఎంపిక ప్రక్రియలో టైర్ 1, టైర్ 2 రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. తుది ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ పోస్టులకు రూ.35,400, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500, ఇతర పోస్టులకు రూ.29,200 జీతంతో పాటు ఇతర భత్యాలు లభిస్తాయి.
ప్రాథమిక రాత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. అందులో జనరల్ అవేర్నెస్ – 40 మార్కులు, మ్యాథ్స్ – 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ – 30 మార్కులు ఉంటాయి. ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించడానికి నవంబర్ 22 వరకు, దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవడానికి డిసెంబర్ 2 వరకు అవకాశం ఉంది. ఈ భారీ నియామకాలు రైల్వే ఉద్యోగాలను ఆశిస్తున్న వేలాది అభ్యర్థులకు కొత్త అవకాశాలను తెరవనున్నాయి.