Karimnagar Crime: కరీంనగర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం.. 30 రౌండ్ల కాల్పులు.. రక్తసిక్తమైన జ్యువెల్లరీ దుకాణం.!

Karimnagar Crime: కరీంనగర్ పట్టణంలో ఓ జ్యువెల్లరీ దుకాణంలో భారీ దొంగతనం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటలకు దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపి ఈ దొంగతనానికి పాల్పడ్డారు.

Published : 2026-05-03 13:01:00
  • సిబ్బందిపై కాల్పులు జరిపి దొంగతనానికి పాల్పడిన దుండగులు..
     
  • Media: తుపాకులతో జ్యువెల్లరీ షాప్‌లోకి ప్రవేశించిన దుండగులు..

Karimnagar Crime: కరీంనగర్ నగర నడిబొడ్డున ఉన్న ఒక ప్రముఖ జ్యువెల్లరీ దుకాణంలో పట్టపగలే సాయుధ దుండగులు తెగబడ్డారు. ఈరోజు ఉదయం సుమారు 10 గంటల సమయంలో నగరంలోని పీఎంజీ జ్యువెల్లరీ షాపులోకి ఆరుగురు దుండగులు ఒక్కసారిగా చొరబడి కాల్పులకు తెగబడ్డారు. దుకాణం వద్ద కాపలా ఉన్న భద్రతా సిబ్బంది వారిని ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆగ్రహించిన దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా సుమారు 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపి భీభత్సం సృష్టించారు. అనంతరం లోపల ఉన్న మిగతా సిబ్బందిని బంధించి, భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని స్థానిక ఆసుపత్రికి తరలించగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. ఒక్కసారిగా పేలిన తూటాల శబ్దంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే కరీంనగర్ పోలీసులు భారీ బలగాలతో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుండగుల కాల్పుల తీవ్రతను చూస్తుంటే ఇది ఏదైనా అంతర్రాష్ట్ర ముఠా పని అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు జ్యువెల్లరీ దుకాణంలోని సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారు. నగరవ్యాప్తంగా నాకాబంధీ నిర్వహించి సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పట్టపగలే, రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి భారీ దోపిడీ జరగడం కరీంనగర్ పట్టణంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Spotlight

Read More →