ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుసైని(60) (Shihan Hussaini) కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజులుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ క్రమంలో చైన్నెలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్కు హుసైని మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్లో శిక్షణ ఇచ్చారు. ఇక షిహాన్ హుసైని 1986లో విడుదలైన 'పున్నగై మన్నన్' చిత్రం ద్వారా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. పలు చిత్రాల్లో నటించిన ఆయనకు విజయ్ హీరోగా నటించిన బద్రి మంచి గుర్తింపునిచ్చింది. ఆర్చరీలోనూ శిక్షకుడిగా ఉన్న ఆయన ఆ రంగంలో 400 మందికి పైగా విద్యార్థులను తయారు చేశారు. హుసైని మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తన గురువు మరణించడంతో పవన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుద‌ల చేశారు.  "ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు  షిహాన్ హుసైని గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుసైని గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది. వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను. అలాగే ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్లి హుసైని గారిని పరామర్శించాలని నిర్ణయించుకొన్నాను. ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. ఆయ‌న‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

ఇది కూడా చదవండి: లోక్ సభలో ఏపీ మద్యం కుంభకోణంపై కీలక వ్యాఖ్యలు! రూ.4 వేల కోట్లు దేశం దాటించేశారు!


చెన్నైలో హుసైని గారు కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. ఆయన చెప్పినవి కచ్చితంగా పాటించేవాడిని. తొలుత ఆయన కరాటే నేర్పేందుకు ఒప్పుకోలేదు. 'ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు, కుదరదు' అన్నారు. ఎంతో బతిమాలితే ఒప్పుకొన్నారు. తెల్లవారుజామునే వెళ్లి సాయంత్రం వరకూ ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రంలో కథానాయక పాత్ర కిక్ బాక్సింగ్ నేర్చుకొనేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు- నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి. హుసైని గారి శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుసైని గారు తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు.

హుసైని గారి ప్రతిభ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చక్కటి చిత్రకారులు, శిల్పి. పలు చిత్రాల్లో నటించారు. స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. చెన్నై రోటరీ క్లబ్, ఇతర సమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే వెంట తీసుకువెళ్లేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుసైని గారు మార్షల్ ఆర్ట్స్ ను యువతీయువకులకు మరింత చేరువ చేయాలని ఆకాంక్షించేవారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందచేయాలని ప్రకటించడం-ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించింది. హుసైని గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను" అని పత్రికా ప్రకటనలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.