ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి గట్టిగా కృషి చేస్తోంది. ఈ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. హోమ్స్టేలు, ఏరోడ్రోమ్లు వంటి కొత్త చర్యలతో రాష్ట్రంలోని సహజసౌందర్యాలను దేశ విదేశాల సందర్శకులకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా మరో వినూత్న ఆలోచనతో ముందుకు వస్తోంది – కారవాన్ టూరిజం పాలసీ.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న కారవాన్ టూరిజం ప్రణాళికలను ఆదర్శంగా తీసుకుని, ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా కారవాన్ టూరిజం పాలసీ రూపొందిస్తోంది. ఈ పాలసీ ప్రకారం రాష్ట్రంలోని ప్రాధాన్య ప్రాంతాల్లో కారవాన్ పార్కులను అభివృద్ధి చేయనుంది. అరకూ, భీమిలి తదితర ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదు చోట్ల ఈ పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
ఈ పార్కుల్లో 24 గంటలూ అందుబాటులో ఉండే కారవాన్ వాహనాలు, విశ్రాంతికి అనువైన వసతులు, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, వాకింగ్ ట్రాక్లు, సిట్ అవుట్ ప్రాంతాలు, బ్యాడ్మింటన్ కోర్టులు వంటి వినోద సదుపాయాలను కల్పించనున్నారు. అడవుల్లోని అందమైన ప్రాంతాలకు సమీపంగా వీటిని ఏర్పాటు చేసి, పర్యాటకులకు థ్రిల్లింగ్ అనుభవాలు అందించనున్నారు.
పర్యాటక శాఖ ఇప్పటికే కారవాన్ టూరిజం పాలసీ ముసాయిదాను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించింది. మంత్రివర్గ చర్చ అనంతరం ఆమోదం పొందే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ఇటీవల విజయవాడలో జరిగిన టూరిజం కాన్క్లేవ్లో కారవాన్లను ప్రదర్శించారు కూడా.
ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మరో ప్రైవేట్ సంస్థతో కలిసి రెండు ఆధునిక కారవాన్లను అభివృద్ధి చేస్తోంది. ఒక కారవాన్లో 12 మంది, మరో కారవాన్లో 8 మంది ప్రయాణించేందుకు వీలుగా డిజైన్ చేశారు. ఇందులో బెడ్లు, కాన్ఫరెన్స్ హాల్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్, కిచెన్, వాష్రూం, సౌండ్ సిస్టమ్స్, సెక్యూరిటీ కెమెరాలు వంటి ఆధునిక సదుపాయాలున్నాయి. హైదరాబాద్ నుంచి గండికోట, సూర్యలంక మార్గాల్లో ఈ కారవాన్ సేవలు అందించే యోచనలో ఉన్నారు.
ఈ చర్యల ద్వారా ప్రకృతి ప్రేమికులు 'కదిలే ఇల్లు' తరహాలో పర్యటిస్తూ, సహజసౌందర్యాన్ని ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.
 
       
   
   
   
 
                       
   
   
   
   
   
   
   
   
   
   
                   
                   
                   
         
         
         
         
         
         
         
         
        