లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) భారీ నియామక ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న విభిన్న బ్రాంచీల్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. మొత్తం 841 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది, అయితే దాని గడువు తుది దశకు చేరుకుంది. ఆసక్తి కలిగిన వారు తప్పనిసరిగా సెప్టెంబర్ 8, 2025లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులు కావాలి. వయోపరిమితి 2025 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. జనరల్ అభ్యర్థులు రూ.700 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు మాత్రం రూ.85 మాత్రమే చెల్లించవలసి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 3, 2025న జరగనుంది. అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నవంబర్ 8, 2025న నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.88,635 నుంచి రూ.1,69,025 వరకు జీతం లభిస్తుంది. ఉద్యోగ ఆసక్తి ఉన్న వారు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు.