తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు..
న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) హెచ్చరించింది. ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఐఎమ్డీ అంచనాల ప్రకారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళ, మహే ప్రాంతాలతో పాటు దక్షిణ అంతర్గత కర్ణాటకలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
అలాగే అండమాన్-నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మరాఠ్వాడ ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా వాతావరణం మారే అవకాశముంది. సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నాయని ఐఎమ్డీ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీతో పాటు హర్యానా, చండీగఢ్, పంజాబ్, అసోం, మేఘాలయ, తీర ప్రాంత కర్ణాటక, తూర్పు రాజస్థాన్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో కూడా ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయని తెలిపింది.
ఇక జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాల సమయంలో చెట్ల కింద నిలబడవద్దని, అవసరం లేకుంటే బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.