బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రోజురోజుకూ హీట్ పుంజుకుంటోంది. ప్రతి ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకునే డ్రామా, ఎమోషన్, గొడవలతో నిండిపోతోంది. ఇప్పటికే హౌస్ నుంచి పలువురు ఎలిమినేట్ కావడంతో ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కొత్త కంటెస్టెంట్లు రంగంలోకి దిగారు. ఈ సారి హౌస్లోకి ప్రవేశించిన వారిలో దివ్వెల మాధురి, అలేఖ్య, చిట్టి పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష, యంగ్ హీరో శ్రీనివాస్ సాయి, టీవీ నటీనటులు నిఖిల్ నాయర్, ఆయేషా జీనత్, గౌరవ్ గుప్తా ఉన్నారు. వీరి ఎంట్రీతో హౌస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది.
అయితే ఎంట్రీ ఇచ్చిన మొదటి రోజే దివ్వెల మాధురి హౌస్లో రచ్చ చేసి, చివరికి కన్నీళ్లు పెట్టుకోవడం హైలైట్గా మారింది. బిగ్ బాస్ నిర్వాహకులు విడుదల చేసిన తాజా ప్రోమోలో మాధురి, కళ్యాణ్, దివ్యల మధ్య ఘర్షణ సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రోమోలో కళ్యాణ్ కిచెన్ దగ్గర ఉన్న మాధురిని పిలిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించగా, ఆమె ‘ఏం కూర్చోకుంటే ఊరుకోరా?’ అంటూ వెటకారంగా స్పందించింది. దీనికి కళ్యాణ్ శాంతంగా రేపటి షెడ్యూల్ మారుస్తామని చెప్పినా, మాధురి కోపంతో స్పందిస్తూ “నేను ఇక్కడికి వచ్చి అరగంట అయ్యింది, అప్పుడే చెప్పొచ్చుగా” అంటూ ప్రతిగా ప్రశ్నించింది.
మాధురి ప్రవర్తనతో కళ్యాణ్తో పాటు దివ్య కూడా షాక్ అయ్యారు. పరిస్థితిని సర్దిచెప్పేందుకు దివ్య ప్రయత్నించినా, మాధురి మరింత ఆగ్రహంగా మాట్లాడింది. చివరికి హౌస్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. దాంతో మాధురి పక్కకు వెళ్లి ఏడుస్తూ కనిపించింది. ఇది చూసిన కళ్యాణ్ కూడా భరణి దగ్గర తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ, “ఇప్పుడు ఏడిస్తే ఎలా?” అని అన్నాడు. ఈ సన్నివేశాలు ప్రోమో విడుదల కావడంతోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్లోకి రావడం ఒక వైపు ప్రేక్షకుల్లో ఆసక్తి రేపితే, మరో వైపు ఆమె తొలి రోజు నుంచే చేసిన రచ్చ షోకు అదనపు మసాలాగా మారింది. ప్రేక్షకులు సోషల్ మీడియాలో “మాధురి డ్రామా మొదలైంది”, “ఎంట్రీ ఇచ్చి ఒక్క రోజులోనే రచ్చ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్లో కొత్త సమీకరణాలు, కొత్త గొడవలు మొదలయ్యే అవకాశం ఉందని షో అభిమానులు అంటున్నారు. ఈ సీజన్ ఇప్పుడు నిజంగా రసవత్తర దశలోకి ప్రవేశించింది.