భారతదేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. రైలు ప్రయాణం సౌకర్యవంతంగా, వేగంగా, మరింత కనెక్టివిటీతో ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నాలుగు కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి కోసం సుమారు రూ.12,328 కోట్ల భారీ వ్యయం కేటాయించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి దేశ రైల్వే నెట్వర్క్లో కొత్తగా 565 కిలోమీటర్ల లైన్లు చేరుతాయి. ఇది దేశవ్యాప్తంగా రవాణా రంగంలో ఒక పెద్ద మార్పునకు దారి తీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది సికింద్రాబాద్ – వాడి మధ్య మూడవ, నాలుగవ లైన్ల నిర్మాణం. ఈ లైన్ పొడవు 173 కిలోమీటర్లు కాగా, దీనికి రూ.5,012 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లైన్ పూర్తి అయితే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య రైల్వే రాకపోకలు మరింత వేగవంతమవుతాయి. ముఖ్యంగా కలబురగి జిల్లా అభివృద్ధికి ఇది పెద్ద మలుపు కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 47 లక్షల మందికి నేరుగా ప్రయోజనం కలగనుంది. రైళ్ల రద్దీ తగ్గడంతో ప్రయాణికులు సులభంగా ప్రయాణించగలుగుతారు.
ఇక మిగతా మూడు ప్రాజెక్టులు గుజరాత్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో చేపట్టనున్నారు. గుజరాత్లో పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాలను రైల్వే లైన్లతో కలిపి మౌలిక వసతులను మెరుగుపరచనున్నారు. బీహార్లో అధిక జనాభా కారణంగా రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అక్కడ లైన్ విస్తరణ చేసి రద్దీ తగ్గించే ప్రణాళిక ఉంది. ఇక అస్సాంలో ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీ పెంచడం, రైల్వే లింకులు బలోపేతం చేయడమే లక్ష్యం. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయ్యే సరికి ప్రాంతీయ అసమానతలు తగ్గి, సమాన అభివృద్ధికి దోహదం చేస్తాయి.
ఈ నాలుగు ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కలగనున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం మొత్తం 251 లక్షల పనిదినాల ప్రత్యక్ష ఉపాధి లభిస్తుంది. ఇది కేవలం తాత్కాలిక ఉద్యోగాలకే కాకుండా, దీర్ఘకాలిక ఆర్థిక లాభాలకు కూడా దారి తీస్తుంది. రైల్వే నెట్వర్క్ విస్తరణతో వాణిజ్యం, పరిశ్రమలు, వ్యవసాయం అన్ని రంగాలు బలపడతాయి. రైళ్ల జాప్యం తగ్గడంతో సరుకు రవాణా వేగవంతమవుతుంది.
కొత్త లైన్లు అందుబాటులోకి వస్తే బొగ్గు, సిమెంట్, స్టీల్, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా త్వరగా జరగుతుంది. ఇది పరిశ్రమల అభివృద్ధికి, రైతుల ఉత్పత్తులు సులభంగా మార్కెట్లకు చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యాపార వాణిజ్యం పెరగడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక రైల్వే కనెక్టివిటీ పెరగడమే కాకుండా, కోట్లాది మంది జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయని చెప్పవచ్చు.