నేడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం బాధితుల ఆర్తనాదాలతో హోరెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రులు మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలు, రాజకీయ వేధింపులు, పోలీసుల ఏకపక్ష ధోరణిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ పట్టణ ఆర్థిక, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఈ విన్నపాలను స్వీకరించి, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నెల్లూరు రూరల్ మండలం ఎన్.సి.సి కాలనీకి చెందిన బాపూజీ తన భూమి ఆక్రమణపై ఫిర్యాదు చేస్తూ, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుల అరాచకాలను ఎండగట్టారు. గత 45 ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థలాన్ని, రోడ్డును తప్పుడు రికార్డులతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు కూడా అక్రమార్కులకు సహకరిస్తూ, లేని ప్లాట్ నంబర్లతో దొంగ రిజిస్ట్రేషన్లు సృష్టించారని, ప్రశ్నిస్తే పోలీసులు సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు మొరపెట్టుకున్నారు.
సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండలంలో వైకాపా నేతల బరితెగింపు మరోసారి బయటపడింది. రామచంద్రారెడ్డి అనే బాధితుడు తన వృద్ధ తండ్రిపై వైకాపా నాయకులు హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. గ్రామంలోని అధికార పార్టీ నేతలు సామూహికంగా దాడికి పాల్పడినప్పటికీ, స్థానిక పోలీసులు రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. నిందితులకు పోలీసులే వత్తాసు పలుకుతుండటం వల్ల తమకు ప్రాణహాని ఉందని బాధితుడు వాపోయారు.
పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో భూమి రికార్డుల తారుమారుపై నాగలక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన తమ భూమిని, కేవలం ఇంటి పేరు ఒక్కటేనన్న సాకుతో కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి ఆక్రమించేందుకు చూస్తున్నారని వివరించారు. 1926 నాటి రిజిస్ట్రేషన్ పత్రాలు తమ వద్ద ఉన్నప్పటికీ, రెవెన్యూ అధికారులు తప్పుడు రికార్డులను ప్రోత్సహించడంపై ఆమె విస్మయం వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లాలోని క్రోసూరు మరియు సత్తెనపల్లి మండలాల నుండి కూడా భూ వివాదాలకు సంబంధించి కీలక ఫిర్యాదులు అందాయి. అనంతవరం గ్రామానికి చెందిన వెంకటకృష్ణారెడ్డి తన స్థలాన్ని పక్కనే ఉండేవారు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, దీనిపై ఎస్.ఐ ఫిర్యాదు తీసుకోకపోగా దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. అలాగే ధూళిపాళ్ల గ్రామానికి చెందిన హనుమంతురావు తన వారసత్వ భూమికి 1996 నుండి పాస్ పుస్తకం రావడం లేదని, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని నివేదించారు.
కడప మరియు అనకాపల్లి జిల్లాల నుండి అధికారుల నిర్లక్ష్యంపై వినతులు వచ్చాయి. ముద్దనూరుకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, తనకు అనుకూలంగా జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, స్థానిక తహశీల్దార్ కార్యాలయం వాటిని అమలు చేయడం లేదని ఫిర్యాదు చేశారు. అనకాపల్లికి చెందిన అప్పలనర్సమ్మ, తన భూమికి వేరొకరి పేరుతో తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించారని, విచారణలో నిజం తేలినా రికార్డుల్లో మార్పులు చేయడం లేదని అధికారుల తీరును ఎండగట్టారు.
కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన పద్మజ తన భూమిపై జరుగుతున్న రౌడీయిజం గురించి వివరించారు. 1971 నాటి సరిహద్దులను తొలగించి, పొరుగువారు దౌర్జన్యంగా స్థలాన్ని ఆక్రమించారని, పోలీసులకు మరియు కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, విశాఖపట్నంకు చెందిన మాజీ సైనికుడు విజయశర్మ, తనకు ప్రభుత్వం కేటాయించిన భూమిని ఇప్పటికీ రికార్డులలో 'జిరాయితీ'గా మార్చలేదని, తనకు పూర్తి హక్కులు కల్పించాలని కోరారు.
భూ వివాదాలే కాకుండా, సామాజిక భద్రతకు సంబంధించిన విన్నపాలు కూడా ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్నాయి. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణ నిధుల కోసం అనేకమంది అర్జీలు సమర్పించారు. నిరుద్యోగులు తమ ఉపాధి కోసం రెస్యూమ్ లు అందించగా, అనారోగ్య బాధితులు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం కోరారు. ఈ సమస్యలన్నింటినీ పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, త్వరితగతిన పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
తేదీ 29-04-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 25 ఏప్రిల్ 2026 (బుధవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి రెడ్డి (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ కిడారి శ్రవణ్ (ఏపీ గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ )