సర్పవరం క్షేత్రం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు…
పురాణాల నుంచి నేటి వరకు ఈ గుడికున్న ప్రత్యేకతలేంటి…
ఇక్కడి స్వామిని దర్శిస్తే చాలు సకల పాపాలు హరిస్తాయి…
Sarpavaram Temple: కాకినాడ అనగానే అందరికీ గుర్తొచ్చే ప్రాంతం సర్పవరం కానీ, ఈ పేరు వెనుక వేల ఏళ్ల నాటి ఒక అద్భుతమైన పురాణ గాథ ఉందన్న విషయం ఎంతమందికి తెలుసు? కశ్యప ప్రజాపతి భార్యలైన కద్రువ, వినతల మధ్య జరిగిన పంతం, ఆపై చోటుచేసుకున్న శాపాలు.. పుణ్యక్షేత్ర ఆవిర్భావానికి దారితీశాయి. ఆ ఆసక్తికరమైన విషయాలు మీ కోసం .
పురాణాల ప్రకారం, కశ్యప మునికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కద్రువ తనకు వెయ్యి మంది సంతానం కావాలని కోరుకోగా, చిన్న భార్య వినత మాత్రం తనకు ఇద్దరే పిల్లలు కావాలని, కానీ వారు కద్రువ పిల్లల కంటే అమిత శక్తివంతులు కావాలని కోరుకుంది. కశ్యపుడు వారి కోరిక మేరకు కద్రువకు వెయ్యి అండాలు, వినతకు రెండు అండాలు ప్రసాదించాడు. కాలక్రమేణా కద్రువ అండాల నుండి వెయ్యి సర్పాలు జన్మించాయి. అయితే, వినత తొందరపాటు వల్ల ఒక అండాన్ని పగలగొట్టడంతో సగం శరీరం మాత్రమే ఉన్న 'అనూరుడు' జన్మించి, తన తల్లిని శపించాడు. ఆ తర్వాత రెండో అండం నుండి మహా శక్తివంతుడైన 'గరుత్మంతుడు' జన్మించాడు.
వినత సంతానం తన పిల్లల కంటే శక్తివంతులు కావడాన్ని కద్రువ సహించలేకపోయింది. ఎలాగైనా వినతను తన బానిసగా చేసుకోవాలని ఒక పన్నాగం పన్నింది. ఆకాశంలో ఎగురుతున్న 'ఉచ్చైశ్రవం' అనే తెల్లని గుర్రం తోక నల్లగా ఉందని కద్రువ వాదించింది. ఒకవేళ తోక నల్లగా ఉంటే వినత తనకు దాసిగా ఉండాలని పందెం కట్టింది. నిజానికి ఆ గుర్రం పూర్తిగా తెల్లగా ఉన్నప్పటికీ, పందెంలో గెలవడం కోసం కద్రువ తన సర్ప పిల్లలను పిలిచి ఆ గుర్రం తోకకు చుట్టుకోమని ఆదేశించింది. తద్వారా దూరం నుండి చూసేవారికి తోక నల్లగా కనిపిస్తుందని ఆమె ప్లాన్.
తల్లి చెప్పిన ఈ మోసపూరిత పనికి సర్పాలు నిరాకరించాయి. ధర్మాన్ని తప్పడం సరికాదని ఎదురుచెప్పాయి. దీంతో ఆగ్రహించిన కద్రువ, తన మాట వినని సర్పాలన్నీ జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి కాలిపోతాయని శాపమిచ్చింది. తల్లి శాపానికి భయపడిన సర్పాలు చివరకు గుర్రం తోకకు చుట్టుకున్నాయి. ఫలితంగా తోక నల్లగా ఉందని నమ్మించి వినతను తన దాసిగా మార్చుకుంది కద్రువ. ఈ మోసంలో భాగస్వాములైనందుకు సర్పాలు తీవ్ర మనస్తాపానికి గురయ్యాయి.
ఆ వెయ్యి సర్పాలలో ఒకడైన ఆదిశేషుడు, తన తల్లి చేసిన మోసానికి, తాము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రశాంతమైన ప్రదేశం కోసం వెతుకుతూ ప్రస్తుత కాకినాడ సమీపంలోని ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆదిశేషుని భక్తికి మెచ్చిన స్వామి ప్రత్యక్షమవ్వగా, తన పాపాలను తొలగించి, ఎల్లప్పుడూ స్వామివారి చెంతనే ఉండే వరాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు.
ఆదిశేషుని కోరిక మేరకు విష్ణుమూర్తి అతనికి అభయమిచ్చాడు. ఆదిశేషుడు తపస్సు చేసి వరం పొందిన ప్రదేశం కాబట్టి, కాలక్రమేణా ఇది 'సర్పవరం'గా ప్రసిద్ధి చెందింది. నేటికీ ఇక్కడ వెలసిన భావనారాయణ స్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా భక్తులు నమ్ముతారు. కాకినాడ వెళ్లే పర్యాటకులు ఈ పురాణ నేపథ్యం తెలిస్తే, ఆ క్షేత్ర దర్శనం మరిన్ని మధుర జ్ఞాపకాలను మిగిలిస్తుంది.