ప్రపంచంలోనే కఠిన మారథాన్ను జయించిన తెలుగు వైద్యుడు..
ఎవరెస్ట్ మారథాన్లో తెలుగు తేజం చాటిన డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డ్ చైర్మన్, ప్రముఖ వైద్య నిపుణులు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి మరో అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మారథాన్లలో ఒకటిగా గుర్తింపు పొందిన టెన్జింగ్-హిల్లరీ ఎవరెస్ట్ మారథాన్ను విజయవంతంగా పూర్తి చేసి తెలుగు వారి పట్టుదల, సాహసస్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పారు.
ఎవరెస్ట్ బేస్ క్యాంప్ పరిసర ప్రాంతాల్లో ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక మారథాన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో జరిగే రన్నింగ్ ఈవెంట్గా ప్రసిద్ధి చెందింది. సముద్ర మట్టానికి సుమారు 5,364 మీటర్ల ఎత్తులో జరిగే ఈ పోటీలో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండటంతో పాటు మైనస్ డిగ్రీల చలి, మంచుతో కప్పుకున్న ప్రమాదకర మార్గాలు, కఠిన వాతావరణ పరిస్థితులు పోటీదారులకు పెద్ద సవాలుగా నిలుస్తాయి.
ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ధైర్యంగా రేసును పూర్తి చేయడం ఆయన శారీరక సామర్థ్యానికి, మానసిక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై తెలుగు సమాజం, తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఆయన విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సాహస యాత్ర వెనుక ఒక ప్రత్యేక లక్ష్యం కూడా ఉందని ఆయన తెలిపారు. పురాణ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన ‘తానా విశ్వ గురుకులం’ అనే వినూత్న విద్యా బోధనా విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, ముఖ్యంగా అమెరికాలోని ప్రవాసాంధ్రులకు పరిచయం చేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. తానా సంస్థ ఆశయాలు, సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి కేవలం మారథాన్ రన్నర్ మాత్రమే కాదు, అనుభవజ్ఞుడైన పర్వతారోహకుడిగానూ గుర్తింపు పొందారు. ప్రపంచంలోని ఏడు అత్యున్నత శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో సాగుతున్న ఆయన ఇప్పటికే మూడు ప్రముఖ పర్వతాలను విజయవంతంగా అధిరోహించారు.
ఇండోనేషియాలోని కార్స్టెన్స్ పిరమిడ్, రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్, టాంజానియాలోని మౌంట్ కిలిమంజారో శిఖరాలను ఆయన అధిరోహించడం విశేషం. ఈ విజయాలు ఆయనలోని సాహసస్ఫూర్తిని మరింత ప్రతిబింబిస్తున్నాయి.
ఈ సందర్భంగా డా. నాగేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ తానా చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే 2027లో డా. నరేన్ కొడాలి అధ్యక్షతన జరగనున్న తానా స్వర్ణోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి సాధించిన ఈ అంతర్జాతీయ విజయం యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తోందని పలువురు అభినందిస్తున్నారు.