సీఎం చంద్రబాబు మానవత్వానికి చామవరంలో హృద్యమైన నిదర్శనం..
భుజంపై చేయివేసి దివ్యాంగ యువకుడికి ధైర్యం చెప్పిన చంద్రబాబు..
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని చామవరంలో నిర్వహించిన “పేదల సేవలో” కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో చోటుచేసుకున్న ఒక హృదయాన్ని హత్తుకునే సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
కార్యక్రమానికి వచ్చిన ఓ దివ్యాంగ యువకుడిని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దగ్గరకు వెళ్లి పలకరించారు. స్వయంగా అతని భుజంపై చేయి వేసి మాట్లాడి, కలిసి ఫోటో దిగడంతో ఆ యువకుడు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. తమ కుమారుడికి చంద్రబాబు అంటే ఎంతో అభిమానమని, ఆయనను ఒక్కసారి దగ్గరగా చూడాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాడని ఆ యువకుడి తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి తెలిపారు.
దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు ఆ దివ్యాంగ యువకుడికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ను అక్కడికక్కడే ఆదేశించారు. సీఎం చూపిన ఆప్యాయత, స్పందన అక్కడ ఉన్న వారిని కదిలించింది.
అనంతరం ప్రజా వేదిక సమీపంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శించారు. ముఖ్యంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల స్టాళ్ల వద్ద సాగుతున్న పంటల పరిస్థితులు, రైతులకు అందిస్తున్న సేవల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో వ్యవసాయ రంగంలో కొత్త పద్ధతులను ప్రోత్సహించాలని సూచించిన సీఎం, రైతులు మైక్రో న్యూట్రియంట్స్ వినియోగంపై మరింత అవగాహన పెంచుకోవాలని చెప్పారు. అలాగే ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించే దిశగా అధికారులు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై స్పందిస్తూ సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు కార్యక్రమానికి వచ్చిన వారిని ఆకట్టుకుంది.