రాష్ట్రవ్యాప్తంగా 25 కొత్త హాస్టళ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం..
ఐఐటీ-నీట్ ఎక్సలెన్సీ సెంటర్ల విస్తరణకు ప్రభుత్వం భారీ ప్రణాళిక..
మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించిన సంక్షేమ కార్యక్రమాలు పేద విద్యార్థుల్లో కొత్త ఆశలను నింపుతున్నాయి. పేద కుటుంబాల పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లు, ఇంజనీర్లు, సివిల్స్ అధికారులు కావాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.
సోమవారం ప్రకాశం జిల్లా ఒంగోలులోని సంతపేటలో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎస్సీ బాలికల హాస్టల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందన్నారు. పీఎం అజయ్ పథకం కింద రూ.86 కోట్లతో 25 కొత్త హాస్టళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా సాస్కి నిధుల ద్వారా రూ.200 కోట్లతో హాస్టళ్ల మరమ్మతులు, అదనపు భవనాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే రూ.143 కోట్లతో 700 హాస్టళ్లకు మరమ్మతులు పూర్తయ్యాయని వెల్లడించారు.
అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కోసం రూ.58 కోట్లతో అదనపు మరుగుదొడ్లు నిర్మించామని మంత్రి తెలిపారు. ఒంగోలులో దివ్యాంగ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూ.3 కోట్లతో హాస్టల్ నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. త్వరలోనే హాస్టళ్లలో మెస్ చార్జీలను కూడా పెంచనున్నట్లు వెల్లడించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పోటీ పరీక్షల శిక్షణపైనా దృష్టి పెట్టిందన్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖలోని స్టడీ సర్కిళ్లలో 450 మందికి ఉచితంగా సివిల్స్ కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు. త్వరలో ఒంగోలు, అమలాపురంలో కూడా కొత్త స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఉద్యోగ అవకాశాల పెంపుపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. 250 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచిత శిక్షణ ఇచ్చి, జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం ప్రారంభించినట్లు వివరించారు.
పేదల పిల్లలు కూడా ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో రాణించాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందన్నారు. ప్రస్తుతం ఉన్న మూడు ఐఐటీ-నీట్ ఎక్సలెన్సీ సెంటర్లను 13కి పెంచామని, త్వరలోనే మరో 12 ఏర్పాటు చేసి మొత్తం 25 జిల్లాలకు 25 ఎక్సలెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.