అగ్నిప్రమాద బాధితులకు సబ్సిడీపై మోటార్లు ఇస్తామని మంత్రి హామీ..
తాళ్లపోడులో రైతు కుటుంబానికి మంత్రి సుభాష్ పరామర్శ..
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం ఒక కౌలు రైతు కుటుంబాన్ని తీవ్ర ఆవేదనలోకి నెట్టింది. రామచంద్రపురం నియోజకవర్గంలోని కె.గంగవరం మండలం తాళ్లపోడు గ్రామంలో పంటపొలాల్లో మంటలు చెలరేగి ధాన్యం, గడ్డి కట్టలు, నీటి మోటార్లు కాలిపోవడంతో రైతులు భారీ నష్టాన్ని చవిచూశారు. ఈ ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించి బాధిత రైతుకు అండగా నిలిచారు.
అగ్నిప్రమాదంలో దొమ్మటి సత్యనారాయణ అనే కౌలు రైతుకు చెందిన సుమారు 15 బస్తాల ధాన్యం పూర్తిగా కాలిపోయింది. అలాగే విత్తనాల నాగేశ్వరరావు, దొమ్మటి సత్యనారాయణకు చెందిన రెండు నీరు తోడుకొనే మోటార్లు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. పొలాల్లో మిషన్తో కట్టించిన గడ్డి కట్టలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా తాళ్లపోడు గ్రామానికి వెళ్లి బాధిత రైతులను పరామర్శించారు. రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా దొమ్మటి సత్యనారాయణకు వ్యక్తిగతంగా రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందజేశారు.
అదేవిధంగా ప్రమాదంలో కాలిపోయిన నీటి మోటార్ల విషయమై వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి, సబ్సిడీపై కొత్త మోటార్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు.
అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన సమయంలో మంత్రి స్వయంగా గ్రామానికి వచ్చి పరామర్శించడం, ఆర్థిక సహాయం అందించడం పట్ల బాధిత రైతులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల పట్ల మంత్రి చూపిన మానవత్వం, బాధ్యతాభావం అభినందనీయమని గ్రామస్థులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కె.గంగవరం మండల తహసీల్దార్ శ్రీరామ ప్రసాద్, ఆర్ఐ వెంకట్రావు, మండల టీడీపీ అధ్యక్షుడు మేడిశెట్టి రవికుమార్, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు బలుసు శివప్రసాద్, రవ్వా భూషణం, మండల వ్యవసాయ అధికారి సద్గురు మూర్తి, పలువురు అధికారులు, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.