నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసు: అరెస్టుల సంఖ్య 13కు చేరింది..
నీట్ లీక్ వ్యవహారంలో డాక్టర్, కోచింగ్ ఫ్యాకల్టీ అరెస్ట్..
మెడికల్ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణే, లాతూర్, అహల్యానగర్ వంటి ప్రాంతాల్లో నిందితులను గుర్తించి అరెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో తాజాగా అరెస్టైన వారిలో లాతూర్కు చెందిన డాక్టర్ మనోజ్ షిరురే ఒకరు. సీబీఐ వివరాల ప్రకారం, ఆయన కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. ఇప్పటికే అరెస్టైన పి.వి. కులకర్ణి నుంచి కెమిస్ట్రీ ప్రశ్నాపత్రాన్ని పొందిన డాక్టర్ మనోజ్, ముగ్గురు విద్యార్థులకు ఆ ప్రశ్నలను అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరిలో ఒకరు కోచింగ్ సెంటర్ యజమాని కుమారుడు కావడం మరింత సంచలనంగా మారింది.
మరో నిందితుడు తేజస్ హర్షద్కుమార్ షా. ఆయన పుణేలోని డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ఇప్పటికే అరెస్టైన మనీషా హవల్దార్ నుంచి నీట్ ఫిజిక్స్ ప్రశ్నాపత్రాన్ని ఆయన పొందినట్లు సీబీఐ తెలిపింది.
దర్యాప్తు భాగంగా దేశవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎలక్ట్రానిక్ ఆధారాల ఆధారంగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నెల 3న నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న ఆరోపణలు రావడంతో పరీక్షను రద్దు చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకావడంతో, ఈ ఘటన తీవ్ర ఆందోళనకు కారణమైంది. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నిరాశ నెలకొనగా, పారదర్శకంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.